● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: జిల్లాలో 61.86శాతం డిజిటలైజేషన్ పూర్తి అయిందని, ఫారాల సేకరణతో పాటు డిజిటలైజేషన్ గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలందరి సహకారంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఇంకా 82,994 ఫారాల సేకరణతో పాటు 38.14 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. గడువులోపు వందశాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రతీ ఇంటిని బీఎల్ఓలు తప్పనిసరిగా సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, పూర్తిగా నింపిన ఫారాలను తిరిగి సేకరించాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇవ్వకుండా, ఓటరు జాబితా ఖచ్చితత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు ఉండేలా ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
పైలాన్ పనుల్లో వేగం పెంచాలి
ములుగు రూరల్: జిల్లా అభివృద్ధి పనులను ప్రతిభింభించేలా ఉన్న పైలాన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పైలాన్ నిర్మాణ పనులు, సమీకృత కలెక్టరేట్ ఆవరణలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పైలాన్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, జిల్లా ప్రగతి ప్రతిభింభించేలా పైలాన్ నిర్మాణం సాగుతుందని వివరించారు. నిర్మాణ పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు తప్పని సరిగా పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ల్యాండ్ స్కేపింగ్ పనులను పరిశీలించారు. పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్కుమార్, హర్టికల్చర్ అధికారి సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


