● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు రూరల్: పోలీస్ అధికారులు నేర నియంత్రణలో రాజీపడవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వినియోగ నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల నివారణకు గస్తీ విధులు పెంచాలని అధికారులను ఆదేశించారు. నేర నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామస్థాయిలో బలమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కల్తీ మద్యం, గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలను గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కోర్టు విచారణలో ఉన్న కేసుల పురోగతిపై దృష్టి సారించాలన్నారు. కోర్టు కానిస్టేబుళ్ల పనితీరును పరిశీలించాలని పేర్కొన్నారు. కోర్టు కేసుల్లో సరైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్షపడే విధంగా చూడాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


