ఏటూరునాగారం: పోడు భూముల సాగును ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దావూద్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం, అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఐటీడీఏ ఎస్డీసీ గంట ప్రతాప్, అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ అశోక్కు అందజేశారు. ఈ సందర్భంగా దావూద్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోరం చిరంజీవి మాట్లాడుతూ కన్నాయిగూడెం మండల పరిధిలోని మలకపల్లి గ్రామంలోని ఆదివాసీ కుటుంబాలు దాదాపు 25 ఏళ్లుగా భూములను ట్రాక్టర్లతో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. గతంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఫారెస్ట్ అధికారులు ఈ ఏడాది ట్రాక్టర్లతో దున్నుకోవద్దని చెప్పడంతో ఆదివాసీలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన ఈ సమయంలో సాగు పనులు ఆలస్యమైతే పంటలు దెబ్బతిని ఆదివాసీ రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించి ఆదివాసులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ బాబు, దేవయ్య, టీఎల్ రవి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తోలం కృష్ణయ్య, రైతులు భద్రయ్య, పవన్, చుక్కయ్య, రాజు, భీమయ్య, రమేశ్ పాల్గొన్నారు.
ఐటీడీఏ ఎదుట ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దావూద్


