కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్.. ప్రస్తుతం 'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్నాడు. మరోవైపు హీరోగా నటించిన 'టాక్సిక్' రిలీజ్ కావాల్సి వచ్చింది. లెక్క ప్రకారం రెండోసారి వాయిదా పడిన తర్వాత జూన్ 4నే విడుదల అని అన్నారు గానీ ఇప్పటివరకు సౌండ్ లేదు అంటే కచ్చితంగా వాయిదా పడినట్లే. ఇవి అలా ఉండగానే యష్ దంపతులు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)
యష్, అతడి భార్య రాధిక పండిట్ కలిసి.. మహారాష్ట్రలోని ప్రముఖ తీర ప్రాంత పర్యాటక కేంద్రం అలీబాగ్లో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టారు. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్ ప్రకారం అలీబాగ్ తాలూకా కమత్ గ్రామంలో ఉన్న భూమిని రూ.24 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీ 18వ తేదీన అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు అయింది.
5,289 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన రెండు అనుబంధ వ్యవసాయ భూములు ఇందులో ఉన్నాయి. ఆ స్థలంలో ఒక నివాస గృహ నిర్మాణం కూడా ఉన్నట్లు పత్రాలతో తెలిసింది. అయితే ఈ స్థలాన్ని ఇల్లు కట్టుకునేందుకు కొనుగోలు చేశారా? లేదంటే రియల్ ఎస్టేట్ కోసమా తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా అలీబాగ్ ప్రాంతం సినీ ప్రముఖులు దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైకి సమీపంలో ఉండటంతో పాటు అందమైన కొంకణ్ తీర ప్రాంతం కారణంగా అలీబాగ్ హాట్ టాపిక్ అయిపోతోంది.
(ఇదీ చదవండి: మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు.. సీఎం విజయ్ తో ఖుష్బూ)


