ప్రస్తుతం మైథలాజికల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్పై జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
అనాథ అయిన విశ్వనాథ్(జగదీశ్ ఆమంచి).. ఓ రోజు గుడిలో అను(శ్రావణి శెట్టి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. మరోవైపు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జగడ్.. తన స్నేహితుడు ఆకాశ్తో కలిసి సరదా పాటలు పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అతనికి హరిణి(అద్విక శర్మ)అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె అంటే జగడ్కి చాలా ఇష్టం. కానీ హరిణి మాత్రం జగడ్ ప్రేమని సీరియస్గా తీసుకోదు. అంతేకాదు అతని ఫ్రెండ్ ఆకాశ్తో కమిట్ అవుతుంది కూడా. కొన్నాళ్లకి జగడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి స్థాయికి వెళ్లడం.. గ్రామీ అవార్డు కూడా పొందడంతో అతన్ని పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలని హరిణి ప్లాన్ వేస్తుంది. ఆమెకు అడ్డుగా ఉన్న ప్రియుడు ఆకాశ్ని చంపేయాలనుకుంటుంది. అదే సమయంలో ఊరిలోని మహిళలు వరుసగా హత్యగావించబడతారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారుతుంది. అసలు ఈ హత్యలు చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? ఆకాశ్ అడ్డుని తొలగించుకోవాలనుకున్న హరిణి ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? విశ్వ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? జగడ్..హరిణిల వివాహం జరిగిందా లేదా? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మైథలాజికల్ చిత్రాలకు ఇప్పుడు తెలుగులో మంచి ఆదరణ ఉంది. దానికి క్రైమ్ బేస్డ్ స్టోరీ యాడ్ అయితే.. మరింత ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే ఈ ‘యముడు’. ఇందులో వరుస హత్యలు అనే కాన్సెప్ట్ రొటీన్ గా ఉన్నా... వాటికి మైథాలజికల్ టచ్ ఇస్తూ... సినిమాను గరుడ పురాణంతో అనుసంధానం చేసి తెరకెక్కించిన విధానం బాగుంది. ఫస్టాఫ్లో ఒకవైపు లవ్స్టోరీ చూపిస్తూనే.. హత్యలను చూపించడంతో దాని వెనుక ఉన్నదెవరు అనే క్యూరియాసిటీ ప్రెక్షకుల్లో పెంచేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటిగా క్రైమ్ సీన్ వెనుక ఉన్న సీక్రెట్స్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ లో ఇచ్చిన ముగింపు మహిళలకు ఓ మెసేజ్ ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే..
హీరోగా... దర్శకుడిగా... నిర్మాతగా జగదీశ్ ఆమంచి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ పక్కన పెడితే... మిగతా అంశాల్లో తన ప్రతిభను ఆన్ స్క్రీన్ పై చూపించాడు. అతనికి జంటగా నటించిన ఇద్దరు అమ్మాయిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అద్విక శర్మ హాట్ గా కనిపించి యూత్ ను ఆకట్టుకుంది. ఆకాష్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. యముణ్ణి బేస్ చేసుకుని రాసుకున్న సంభాషణలు ఆకట్టుకుంటాయి. క్రైం బేస్డ్ మైథాలజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
- రేటింగ్: 2.5/5


