టైటిల్: వంద దేవుళ్లు
నటీనటులు: విజయ్ ఆంటోనీ, శ్వాసిక, అజయ్ దిషాన్, లిజోమోల్ జోసే, కరుణాస్ తదితరులు
నిర్మాణ సంస్థ:విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
నిర్మాత:రామాంజనేయులు జవ్వాజి
దర్శకత్వం: శశి
సంగీతం: బాలాజీ శ్రీరామ్
సినిమాటోగ్రపీ: ఎస్బీ దర్శన్ కిర్లోష్
ఎడిటర్: హరీష్ యువరాజ్
విడుదల తేది: జూన్ 19, 2026
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన కొత్త చిత్రమే ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ట్రైలర్ని కట్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇలా భారీ అంచనాలతో నేడు(జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు.. సంసార జీవితం ఆస్వాదించే వయసుకొచ్చేసరికే భర్తను కోల్పోవడం.. తర్వాత పిల్లలే ప్రపంచంగా బతికే ఓ తల్లి కథ ఇది. కాలం మారినా ఇప్పటికీ కొన్ని కట్లుబాట్లు మాత్రం మారడం లేదు. చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఒక మహిళకు ‘వితంతువు’ అనే శిక్ష వేసి జీవితాంతం బంధీగానే ఉంచేస్తుంది ఈ సమాజం. భార్యను కోల్పోయిన భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడం సులభం కానీ భర్తను కోల్పోయిన ఒక మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ అంత ఈజీ కాదు. మగాళ్లతో పాటు తోటి ఆడవాళ్లు కూడా అదేదో పెద్ద తప్పుగానే భావిస్తున్నారు. మళ్లీ పెళ్లి అంటే కేవలం శారీరక సుఖం కోసమే అన్నట్లుగా చూస్తున్నారు. అదొక్కటే కాదు శారీరక అవసరాలతో పాటు ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం అని చాట చెప్పిన సినిమా వంద దేవుళ్లు. సినిమా చూస్తున్నప్పుడు ఎంతో మంది అమ్మల జీవితాలు మన కళ్లముందు మెదలుతాయి. ఇదే కాన్సెప్ట్తో దాదాపు 30 ఏళ్ల కిత్రం ‘మా నాన్నకు పెళ్లి’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో శ్రీకాంత్ వాళ్ల నాన్న కృషం రాజుకు మళ్లీ పెళ్లి చేయాలని భావిస్తాడు. ఇందులో హీరో అజయ్ దిషాన్ తన తల్లికి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే కథ-కథనం విషయంలో మాత్రం చాలా తేడానే ఉంది. ఈ సినిమాలో చాలా సున్నితమైన అంశాలను చర్చించారు. పాతికేళ్ల వయసులోనే భర్తను కోల్పోతే.. ఆ మహిళ జీవితాంతం ఒంటరిగానే ఉండాలా? ఆమెకు కూడా శారీరక అవసరాలు ఉంటాయి కదా? దాన్ని ఎందుకు తప్పుగా చూస్తారు? తోడు వెతుక్కుంటే తప్పేంటి? అనే అంశాలను ఇక్కడ చాలా సహజంగా చర్చించారు. ‘నేను కూడా అందరిలాగానే ఉప్పుకారం తింటున్నాను కదా? నాకు కూడా కూడా కోరికలు ఉండవా?’ అని ప్రారంభంలోనే అమ్మ పాత్రతో చెప్పించి, అసలు కథను ప్రారంభించాడు.
పిల్లలు పెద్దయిన తర్వాత తల్లికి మళ్లీ పెళ్లి ఆలోచన రావడం.. ఒక కొడుకు ప్రేమతోనూ, మరొక కొడుకు పెళ్లితోనూ ఆ పెళ్లిని ముడి పెడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఏడు కొండలు పాత్ర ఎంట్రీ తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. యూట్యూబ్ కంటెంట్ నేపథ్యంలోని సన్నివేశాలూ నవ్విస్తాయి. క్లైమాక్స్లో వచ్చే చిన్న ట్విస్ట్ బాగుంటుంది. ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు అలాంటి క్లైమాక్స్ ఊహించలేం.

ఎవరెలా చేశారంటే..
విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో పాత్రలో జీవించేశారు. హీరోయిన్ శ్వాసిక తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా రిచ్గా అనిపించింది. బాలాజీ శ్రీరామ్ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. హరీష్ యువరాజ్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.


