తలైవా తలైవి (తెలుగులో సార్ మేడమ్) వంటి హిట్ చిత్రం తర్వాత పాండిరాజ్ కథ, కథనం, దర్శకత్వం వహించిన సినిమా పరిమళ అండ్ కో. జయరాం, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించారు. డ్యాన్స్ మాస్టర్ శాండి, దర్శకుడు మిస్కిన్, యోగిబాబు, సంతోష్ శోభన్, సంజనా కృష్ణమూర్తి, అనంతిక, జీకేఎం తమిళ్ కమరన్ ముఖ్యపాత్రలు పోషించారు.
సంతోషించా..
తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఊర్వశి మాట్లాడుతూ.. చాలా చిత్రాల్లో కథే హీరో అనే నమ్మకం కలుగుతుందన్నారు. పరిమళ అండ్ కో సినిమా కథ మొదట వినగానే అలాంటి భావనే కలిగిందన్నారు. ఇందులో జయరాం నటిస్తున్నారని తెలియగానే సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. తామిద్దరం ఇంతకుముందు 20కి పైగా చిత్రాల్లో కలిసి నటించామన్నారు. కానీ తర్వాత ఇద్దరి ఆసక్తులు వేరవడంతో చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.
అదే కారణం..
పలు అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చిన కథ జయరాంకు నచ్చకపోవడం, ఆయనకు నచ్చింది తనకు నచ్చకపోవడం జరిగిందన్నారు. దాంతో తామిద్దరం కలిసి నటించి దాదాపు 20 సంవత్సరాలు అయిందన్నారు. ఈ సినిమాను పాండిరాజ్ చాలా వేగంగా పూర్తి చేశారని ఊర్వశి తెలిపారు.


