మరో ప్రపంచం పిలుస్తోంది... రండి! | Upcoming Visual Experience Movies Updates in Tollywood | Sakshi
Sakshi News home page

మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!

Apr 20 2025 12:01 AM | Updated on Apr 20 2025 7:19 AM

Upcoming Visual Experience Movies Updates in Tollywood

వెండితెరపై ఆడియన్స్‌కు అద్భుతమైన విజువల్‌ ఎక్స్‌పీరియన్స్, సినిమాటిక్‌ టెక్నాలజీని చూపించేందుకు మన తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందుకోసం కథల్లో సరికొత్త ప్రపంచాలను, ప్రాంతాలను క్రియేట్‌ చేసి, ఆడియన్స్‌ను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ‘మరో ప్రపంచం పిలుస్తోంది... రండి’ అంటూ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్న కొన్ని చిత్రాలపై కథనం.

విశ్వంభర వరల్డ్‌
ఫాంటసీ జానర్‌లో చిరంజీవి హీరోగా ‘అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి సినిమాలొచ్చాయి. కొంత గ్యాప్‌ తర్వాత చిరంజీవి మళ్లీ ఈ జానర్‌లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో కొంత భాగం కథ 500బీసీ టైమ్‌లో సాగుతుంది. ఈ సీక్వెన్స్‌లో వచ్చే సన్నివేశాలు సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడియన్స్‌కు మంచి విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాయి. కాగా మరోసారి తన విజువల్‌ విజన్‌ను ‘విశ్వంభర’ సినిమాలోనూ చూపించనున్నారు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌లో సరికొత్త విజువల్స్‌ కనిపిస్తున్నాయి.

పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి ఈ సినిమా కథలో కీలకంగా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘విశ్వంభర’ సినిమాలోని కొంత భాగం ఆడియన్స్‌ను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఒక స్పెషల్‌ సాంగ్‌ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ మూవీలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని తెలిసింది. త్రిషా, ఆషికా రంగనాథ్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రల్లో ఇషా చావ్లా, పసుపులేటి రమ్య కనిపిస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

నాలుగో ప్రపంచం కూడా ఉందా? 
కురుక్షేత్ర యుద్ధానికి ఆరువేల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తీసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఈ మూవీలో 2898 ఏడీ సమయంలో కాశీ నగరం ఎలా ఉంటుందో ఊహాత్మకంగా, కల్పితంగా స్క్రీన్‌పై ఆడియన్స్‌కు చూపించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అలాగే ఇదే చిత్రంలో కాంప్లెక్స్, శంభాల అనే మరో రెండు కొత్త ప్రపంచాలను కూడా చూపించారు.

అయితే నాలుగో ప్రపంచం కూడా ఉందని, ఇది ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ ‘కల్కి 2898 ఏడీ పార్ట్‌ 2’లో కనిపిస్తుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇక ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్‌ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌తో  బిజీగా ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. తొలి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్‌ని కూడా కొంత భాగం చిత్రీకరించారట. అయితే సీక్వెల్‌ చిత్రీకరణ 2026లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావొచ్చని, 2028ప్రారంభంలో ఈ మూవీ రిలీజ్‌ అవుతుందనే టాక్‌ ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించనున్నారు.

అలాగే ప్రభాస్‌ హీరోగా ‘హను–మాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ అనే మూవీ రానుందని, ఈ మూవీ కోసం ప్రశాంత్‌ వర్మ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇంకా ప్రభాస్‌ మరో మూవీ ‘సలార్‌’ కోసం ఖాన్సార్‌ అనే ఓ కొత్తప్రాంతాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ ఖాన్సార్‌ గురించి మరింతగా ‘సలార్‌’ రెండో భాగం ‘సలార్‌: శౌర్యాంగపర్వం’లో ఉండనున్నట్లుగా తెలిసింది.

సైన్స్‌ లోకం 
ఆడియన్స్‌ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్‌. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ మూవీ రానుంది. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారట అట్లీ. ఇందుకోసమే ప్రస్తుతం అట్లీ విదేశీ వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులతో కలిసి ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ చేస్తున్నారు. ఈ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెరపై అట్లీ చూపించనున్న ఈ సరికొత్త సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో కొన్ని కొత్త రకాల జంతువులు కూడా కనిపిస్తాయనే ప్రచారం సాగుతోంది.

అంతేకాదు... ఈ మూవీలో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తారని, హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్‌ల పేర్లను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించనున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌పిక్చర్స్‌ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. 2027లో ఈ మూవీ రిలీజ్‌ అయ్యేలా సినిమా షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట.

మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ ఓ మూవీ అంగీకరించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్‌ ఫిల్మ్‌ ఇది. భారతీయ ఇతిహాసాల నుంచి ఇప్పటివరకు రాని ఓ సరికొత్త పాయింట్‌తో త్రివిక్రమ్‌ ఈ మూవీ చేయనున్నారని, ఇందుకోసం స్క్రీన్‌పై కొత్త ప్రపంచాన్ని టీమ్‌ రూపొందించనుందని సమాచారం. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ ఈ సినిమా నిర్మించనున్నారు.

అంజనాద్రిలో జై హనుమాన్‌
బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘హను–మాన్‌’లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అంజనాద్రి అనే ఊరుని చూపించారు. తేజా సజ్జా హీరోగా నటించిన చిత్రం ఇది. నిరంజన్‌ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా ‘హను–మాన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ మూవీ రానుంది. ప్రశాంత్‌ వర్మయే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘జై హను మాన్‌’ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ ఏడాది చివర్లో ‘జై హనుమాన్‌’ చిత్రీకరణలో పాల్గొంటారట రిషబ్‌ శెట్టి. కాగా... ‘జై హనుమాన్‌’ మూవీలో రాముడు, లక్ష్మణుడి పాత్రల ప్రస్తావన కూడా ఉంటుందని, ‘హను–మాన్‌’ సినిమా క్లిప్‌ హ్యాంగర్‌ వీడియోను చూసినవారికి అర్థమయ్యే ఉంటుంది. సో... ‘జై హనుమాన్‌’ సినిమా మరింత పెద్ద స్పాన్‌తో రూపొందనుందని తెలుస్తోంది. సో... ఆటోమేటిక్‌గా ‘అంజనాద్రి’ స్పాన్స్‌ కూడా పెరుగుతుందని ఊహించవచ్చు. ఇలా... అంజనాద్రిలో ‘జై హనుమాన్‌’ సాహసాలు, విన్యాసాలు చూసేందుకు మాత్రం చాలా సమయం ఉంది.

2027లో మూవీ రిలీజ్‌ కావొచ్చు. ఇంకా హను–మాన్‌లో నటించిన తేజా సజ్జా ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’లోనూ ఉంటారని తెలిసింది. అలాగే తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్‌’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ మూవీ రానుంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.

మిస్టిక్‌ థ్రిల్లర్‌ 
‘విరూపాక్ష’ సినిమాలో రుద్రవనం అనే కల్పిత విలేజ్‌లో జరిగే సంఘటనలు ఆడియన్స్‌ను అలరించాయి. సాయిదుర్గా తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత హీరో నాగచైతన్యతో దర్శకుడు కార్తీక్‌ దండు మరో మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీ చిత్రీకరణ ఆల్రెడీప్రారంభమైంది. కాగా ఈ చిత్రం కోసం ‘రుద్రవనం’ మాదిరి మరోప్రాంతాన్ని సృష్టిస్తున్నారట కార్తీక్‌ దండు.

ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్షి కన్నులో ఓ పెద్ద పర్వతంపై నాగచైతన్య ఉన్నట్లుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో నాగచైతన్య ఓ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇక ఈ మూవీలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. సుకుమార్, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌ కావొచ్చు.

వెయ్యేళ్ల క్రితం
ఆధ్యాత్మిక ప్రపంచం ‘శంబాల’కు ఆడియన్స్‌ను తీసుకువెళ్లనున్నారు హీరో ఆది సాయికుమార్‌. జియో సైంటిస్ట్‌గా ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. కాల్పనిక ప్రపంచం శంబాల నేపథ్యంలో యుగంధర్‌ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పదివేల సంవత్సరాల క్రితం, వెయ్యి సంత్సరాల క్రితం, 1980... ఇలా మూడు కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్‌ పేర్కొంది. అర్చనా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శ్వాసిక మరో లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తీశారు మేకర్స్‌. త్వరలోనే టీజర్, ట్రైలర్, రిలీజ్‌ డేట్‌లపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా మేకర్స్‌ ఇటీవల తెలిపారు.

ప్యారడైజ్‌
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ప్యారడైజ్‌’. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో నాని సరికొత్తగా కనిపిస్తున్నారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో సికింద్రాబాద్‌ కుర్రాడిలా నాని నటిస్తారని తెలిసింది. ఈ మూవీ ఆడియన్స్‌కు సరికొత్త విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వనుంది. అప్పటి కాలాన్ని రీ–క్రియేట్‌ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.

ఓ తెగ నాయకుడిగా నాని కనిపిస్తారని, గుర్తింపుకోసం పోరాడే ఓ తెగ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్‌ చెరికూరియే ఈ సినిమానూ నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘హిట్‌ 3’ సినిమా ప్రమోషన్స్‌తో నాని బిజీగా ఉన్నారు. మే 1న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఇక మే రెండో వారం నుంచి ‘ప్యారడైజ్‌’ సినిమా చిత్రీకరణలో నాని పాల్గొంటారని తెలిసింది. ‘ప్యారడైజ్‌’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కిష్కింధపురి!
ఆడియన్స్‌ కోసం ‘కిష్కింధపురి’ అనే హారర్‌ అండ్‌ మిస్టీరియస్‌ వరల్డ్‌ను క్రియేట్‌ చేస్తున్నారట బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. కౌశిక్‌ పెగళ్లపాడి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ మూవీ చేస్తున్నారు. ఈ హారర్‌ అండ్‌ మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీకి ‘కిష్కింధపురి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట మేకర్స్‌. హారర్‌ ఎలిమెంట్స్, ప్రేతాత్మల ప్రస్తావన, ఆధ్యాత్మిక అంశాలతో ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీకి చెందిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

ఇలా ఈ తరహాలో ఆడియన్స్‌ను మరో కొత్త ప్రపంచానికి లేదా కొత్తప్రాంతానికి తీసుకుని వెళ్లే హీరోలు, దర్శక–నిర్మాతలు మరి కొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement