
యూకే నుంచి ఆస్కార్కు నామినేట్ అయిన సినిమా సంతోష్ (Santosh Movie). బ్రిటీష్ ఇండియన్ ఫిలిం మేకర్ సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ మూవీ భారత్లో రిలీజ్కు నోచుకోవడం లేదు. పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. కొన్ని సన్నివేశాలను తీసేయమని కోరిందని, అది ఇష్టం లేకపోవడం వల్లే భారత్లో దీన్ని విడుదల చేయడం లేదని పేర్కొంది.
ఎంతో ప్రయత్నించా..
దీని గురించి సంధ్యా సూరి (Sandhya Suri) మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన సమస్యలు భారత్కు కొత్తేమీ కాదు. వీటి గురించి గతంలోనూ ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. అయినప్పటికీ మా సినిమా రిలీజ్కు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం నచ్చట్లేదేమో! ఈ మూవీని భారత్లో రిలీజ్ చేయడం నాకెంతో అవసరం. దీనికోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. మా చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించమని సీబీఎఫ్సీ కోరింది. వారు చెప్పినట్లు చేస్తే కథ తీవ్రత తగ్గిపోతుంది. సినిమాను దెబ్బతీయడం ఇష్టం లేక రిలీజ్ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది అని పేర్కొంది.
ఆస్కార్ నామినేషన్
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళ కథ ఇది. వితంతువు పోలీసుగా మారి.. దళిత అమ్మాయి హత్య కేసును ఎలా ఛేదిస్తుందన్నది సినిమాలో చూపించారు. కుల వివక్ష, అంటరానితనం, అధికారుల క్రూరత్వం, లైంగిక వేధింపులను ప్రస్తావించారు. ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అలాగే యూకే నుంచి అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్లో షార్ట్ లిస్ట్ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శెహానా గోస్వామి ఉత్తమ నటిగా ఏషియన్ ఫిలిం అవార్డు గెలుచుకుంది.
చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?