బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ మరోసారి జైలుకు వెళ్లనున్నారు. గతంలో చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే ఆయనకు జైలు శిక్ష విధించగా.. తీహార్ జైలు అధికారులకు లొంగిపోయారు. తాజాగా మరో ఏడు కేసుల్లో రాజ్పాల్ యాదవ్కు చుక్కెదురైంది. ఆయన దోషిగా తేలుస్తూ న్యాయస్థానం మూడు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఇప్పటి వరకు ఏడు వేర్వేరు కేసుల్లో ఆయన దోషిగా తేలారు. ఈ కేసుల శిక్షలు అన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ ఏడు చెక్కు బౌన్స్ కేసుల్లో ఫిర్యాదుదారులకు ఒక్కొక్కరికి రూ.1.05 కోట్లు చెల్లించాలని రాజ్పాల్ యాదవ్ను ఆదేశించింది. అదనంగా రూ. 25 వేల జరిమానాతో పాటు.. ఫిర్యాదుదారుడికి రూ. 1,04,75,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి కేసులో ఫిర్యాదుదారుడికి రూ.5,51,380 చెల్లించాలని యాదవ్ భార్య రాధా యాదవ్ను హైకోర్టు ఆదేశించింది. రాజ్పాల్ యాదవ్ ఇప్పటికే డిపాజిట్ చేసిన రూ.2.25 కోట్లు చెల్లించాల్సిన మొత్తంలో సర్దుబాటు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.
బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్పాల్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. గతంలో తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది.


