
బుల్లితెర నటి దీపికా రంగరాజు (Deepika Rangaraju).. ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంది. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. లోపల ఎంత బాధ ఉన్నా అది పైకి కనపడనీయకుండా జాగ్రత్త పడుతుంది. అలాంటిది మొదటిసారి దీపిక తన కష్టాలను బయటపెట్టింది. ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో దీపిక మాట్లాడుతూ.. మనం ఏ పని చేసినా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్లుండాలి. ముఖ్యంగా అమ్మానాన్న మన వెనకాల నిలబడాలి. స్నేహితులు, దగ్గరివాళ్లు.. ఇలా ఎవరో ఒకరు మోటివేట్ చేసేవాళ్లుండాలి. కానీ, అలా నాకంటూ ఎవరూ లేరు.
అలాగైతే సంతోషిస్తారు
ఇప్పటికిప్పుడు నేను యాక్టింగ్ మానేసి ఇంట్లో ఉంటాను, చదువుకుంటాను, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను లేదా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను అని చెప్తే అమ్మవాళ్లు చాలా సంతోషిస్తారు. ఇంట్లో కూర్చుని బాగా చదువుకో అని నాకు స్వాగతం పలుకుతారు. యాక్టింగ్ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ.. నాకు సపోర్ట్గా నిలబడలేదు. వావ్, సూపర్ దీపికా.. చాలా బాగా చేస్తున్నావ్, రెండేళ్లలో చాలా పాపులారిటీ వచ్చింది.
ఒంటరి ప్రయాణం
ఇంకా బాగా చేయు అని ప్రోత్సహిస్తే నేను ఏదైనా చేయగలుగుతాను. ఇంకా ఎదుగుతాను. కానీ ఇప్పుడు నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు అది బోర్ కొడుతుంది. ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే మోటివేషన్ చేసుకుని ముందుకెళ్లాలా? అని బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా.. బ్రహ్మముడి అనే సీరియల్ చేస్తోంది.