కూల్‌ కూల్‌గా... బిజీ బిజీగా... | Tollywood Movies Shooting Update: Some Heroes who are busy shooting in Tollywood | Sakshi
Sakshi News home page

కూల్‌ కూల్‌గా... బిజీ బిజీగా...

Jun 10 2026 4:26 AM | Updated on Jun 10 2026 4:26 AM

Tollywood Movies Shooting Update: Some Heroes who are busy shooting in Tollywood

హమ్మయ్యా... వేసవి ముగుస్తోంది. ఇప్పటి వరకూ భగ భగమంటూ తన ప్రతాపం చూపించిన సూర్యుడు ఇప్పుడు కాస్త చల్లబడుతున్నాడు.  ఎండల తీవ్రత కారణంగా ఇప్పటి వరకూ సినిమా చిత్రీకరణల్లో కాస్త ఆచి తూచి పా ల్గొన్న నటీనటులు ఇప్పుడు వేగం పెంచారు. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో షూటింగ్స్‌ సందడి నెలకొంది.

ప్రస్తుతం పలు సినిమాలు హైదరాబాద్‌తో పా టు పరిసరప్రాంతాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ఓ వైపు నాగార్జున, వెంకటేశ్, రవితేజ వంటి సీనియర్‌ హీరోలతో పా టు మరోవైపు ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, శ్రీవిష్ణు వంటి యంగ్‌ హీరోలు ప్రస్తుతం తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏయే చిత్రాల షూటింగ్స్‌తో కూల్‌ కూల్‌గా... బిజీ బిజీగా ఉన్నారో చూద్దాం....

అల్యూమినియం ఫ్యాక్టరీలో...
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం  ‘నా సామి రంగా’. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. 2025లో ఆయన హీరోగా మిస్‌ అయినప్పటికీ ‘కూలీ, కుబేర’ వంటి సినిమాల్లో కీలక పా త్రల్లో కనిపించారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున కెరీర్‌లో వందో చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ తెరకెక్కిస్తున్నారు. తన సినీ ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున స్వయంగా  నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సీనియర్‌ నటి టబు కూడా నటిస్తున్నారు.

సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాలంటే భారీ హడావుడి ఉంటుంది. కానీ, ఈ చిత్రం విషయంలో చిత్రబృందం చాలా గోప్యత పా టిస్తోంది. ఎలాంటి అధికారిక ప్రకటన, హడావుడి లేకుండానే చిత్రీకరణ  జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగార్జునతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్‌. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఎమోషనల్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్‌లో నాగార్జున కనిపించనున్నారు.

సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. ఆధునిక హాలీవుడ్‌ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్‌’ సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతున్నారు. దీని సాయంతో నాగార్జునను వెండితెరపై మళ్లీ 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు దర్శకుడు. తమ అభిమాన హీరోని ‘శివ’, ‘హలో బ్రదర్‌’ నాటి లుక్‌లో చూస్తామంటూ అక్కినేని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట కార్తీక్‌. ‘నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాల తర్వాత నాగార్జున–టబు మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఇటు ట్రేడ్‌ వర్గాల్లో అటు సినిమా ప్రేమికుల్లో ఈ మూవీపై క్రేజ్‌ పెరిగింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని టాక్‌. 

నాగార్జున కెరీర్‌లోనే వందో చిత్రంగా ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ మూవీలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్‌ అతిథి పా త్రల్లో మెరుస్తారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు. ఈ మూవీ టైటిల్‌ విషయానికి వస్తే ‘కింగ్‌ 100, లాటరీ కింగ్, కింగ్‌ 100 నాటౌట్‌’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజేంద్ర నగర్‌లో...  
హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్‌ అయింది. ఈ మూవీ ద్వారా రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరారు వెంకటేశ్‌. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో కీలకమైన వెంకీ గౌడ పా త్రలో సందడి చేశారు వెంకటేశ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ (ఏకే 47). ఈ మూవీకి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్  పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీ నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌ కెరీర్‌లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో వెంకటేశ్‌ మార్క్‌ కామెడీతో పా టు త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన చిత్రబృందం తాజా షెడ్యూల్‌లో నిమగ్నం అయింది. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది.

వెంకటేశ్‌తో పా టు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్‌. వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన త్రివిక్రమ్‌... తొలిసారి ఆయన్ను డైరెక్ట్‌ చేస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని వెంకటేశ్‌ తన ఖాతాలో వేసుకుంటారని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్‌ ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.  

డబుల్‌ ధమాకా.... 
వరుస పా న్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్‌. ఆయన ప్రస్తుతం ‘ఫౌజీ, స్పిరిట్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌. టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భాను చందర్‌ ముఖ్యమైన పా త్రలుపోషిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ మూవీ తాజా షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ పా ల్గొనకపోయినప్పటికీ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ విడుదల కానుంది.  

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న మరో పా న్‌ ఇండియన్‌ మూవీ ‘స్పిరిట్‌’. ‘అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్‌’ మూవీ ఫేమ్‌ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్‌. ప్రకాశ్‌రాజ్‌ కీలక పా త్రపోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్‌ ప్రోడక్షన్స్, టీ–సిరీస్‌ బ్యానర్స్‌పై ప్రణయ్‌ రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘స్పిరిట్‌’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లోని అజీజ్‌ నగర్‌లో జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌లో హీరో ప్రభాస్‌ పా ల్గొంటున్నారు. ఆయనతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తీస్తున్నారట సందీప్‌ రెడ్డి వంగా. ‘‘స్పిరిట్‌’ చిత్రంలో తన కెరీర్‌లోనే మోస్ట్‌ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు ప్రభాస్‌. ఈ మూవీని తన మార్క్‌ యాక్షన్, ఎమోషన్స్తో అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్‌ రెడ్డి. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పా టు చైనీస్, జపనీస్, కొరియన్‌ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

శంషాబాద్‌లో...  
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా పా న్‌ ఇండియన్‌ మూవీ ‘వారణాసి’. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ మూవీలో రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభ  అనే ప్రతినాయకుడి పా త్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు  రాజమౌళి. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుతో పా టు కీలక తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన క్యారెక్టర్‌పోస్టర్లు, టైటిల్‌ గ్లింప్స్‌కు అత్యద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ‘వారణాసి’ సైన్స్ ఫిక్షన్‌ ట్రావెల్‌ టైమ్‌ మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ. ఇందులో రామాయణం ఎపిసోడ్‌ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది కూడా.

ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ రివీల్‌ చేయడం చర్చనీయాంశం అయింది.    ‘‘రాముడికి, కుంభ కర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ‘వారణాసి’. టైటిల్‌ టీజర్‌లో కుంభ కర్ణుడు, రాముడు, ఆంజనేయుడి తోక, తోక మీద రథం కనిపించాయి కదా... ఈ ఎపిసోడ్‌ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్‌ చేస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా  2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.  

డ్రాగన్‌ టైమ్‌ 
‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్‌’. ‘కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2, సలార్‌’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిల్‌ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్‌ కనకాల, అశుతోష్‌ రానా, అన్షుమన్‌ పుష్కర్, సిద్ధాంత్‌ గు΄్తా, ప్రభాస్‌ శ్రీను, శత్రు, శివ, భిమల్‌ జీత్‌ ఒబెరాయ్‌ తదితరులు ఇతర కీలక పా త్రలుపోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పా న్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో  జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌. ఈ మూవీ కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా మేకోవర్‌ అయిన సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని విడుదల చేసిన ‘డ్రాగన్‌’ టైటిల్‌ అనౌన్స్‌మెంట్, ఫస్ట్‌ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

‘దేవుడు నాకు ఓ గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్‌ నొక్కగానే మర్చిపోవడం’, ‘నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు... మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి.. ΄÷రపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పే డైలాగులు ‘డ్రాగన్‌’ మూవీ గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘‘డ్రాగన్‌’ కథ గోల్డెన్‌ ట్రైయాంగిల్‌ప్రాంతంలోని అంతర్జాతీయ అఫీమ్‌ (ఓపియం) అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్‌ ఇందులో లూగర్‌ అనే పా త్రలో అఫ్గాన్‌ ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన అస్సాసిన్‌–ఇన్‌–చీఫ్‌గా కనిపిస్తారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా 2027 జూన్‌ 11న విడుదల కానుంది.  

నవ్వులు డబుల్‌ 
హీరో శ్రీ విష్ణు సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుంటాయి. ఆయన నుంచి వచ్చిన పలు సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. హీరో శ్రీవిష్ణు– డైరెక్టర్‌ రామ్‌ అబ్బరాజులది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. 2023 జూన్‌ 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదం  అందించడంతో పా టు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.

‘సామజ వరగమన’ వంటి హిట్‌ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్‌ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్‌ కీలక పా త్రలుపోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పా టు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు. ‘సామజ వరగమన’ చిత్రానికి మించి డబుల్‌ వినోదాన్ని  అందించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

యాక్షన్‌... ఎమోషన్‌ 
గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్‌ 34’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ వి. వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్‌ ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.  70ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్‌–అనార్కలితో పా టు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట వెంకట్‌.

‘‘గోపీచంద్‌ 34’ చిత్రం ద్వారా 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. వి. వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్‌ను రూపొందించారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్తో కూడిన పా త్రలో చూపిస్తున్నారు ఆయన. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్‌ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది.  

అల్యూమినియం ఫ్యాక్టరీలో...  
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్‌లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషి’ చిత్రాల ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పా త్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మŠస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ యాక్షన్ మూవీలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు రవితేజ. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.

రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్రతో పా టు సాయి కుమార్, అజయ్‌ ఘోష్, రమేష్‌ ఇందిర, స్వాసిక వంటి నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శివ నిర్వాణ. ఈ నెల 3న విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్‌ ప్రధానంగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ ఉంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్‌... వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూపోషించని విభిన్నమైన పా త్రను ‘ఇరుముడి’లోపోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement