తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్రెడ్డి నిర్మించిన సినిమా ‘హను మాన్’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ. 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమా త్రీడీ వెర్షన్లో ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు సాయి దుర్గాతేజ్ అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘ఏదో పుణ్యం చేసుకుంటే కానీ ‘హను మాన్’ లాంటి సినిమా దొరకదు. ఈ సినిమాలో నటించే చాన్స్ రావడం, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం. మీతో (ఆడియన్స్ను ఉద్దేశించి..)పాటే నేనూ ఇప్పుడే ఈ 3డీ ట్రైలర్ను చూశాను. నిరంజన్, చైతన్యగార్లు పడిన కష్టం అర్థం అవుతోంది. ‘హను మాన్’ సినిమాను త్రీడీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీరూ త్రీడీ సినిమాను థియేటర్స్లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘అత్యాధునిక టెక్నాలజీతో ఈ 3డీ వెర్షన్ను మీ ముందుకు తీసుకువస్తున్నాం.
ఈ వెర్షన్ కూడా మీకు గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది. ‘హను మాన్’కి జాతీయ అవార్డు వచ్చిన రోజు నా బర్త్ డే కావడం ఎంతో ప్రత్యేకం. అలాంటి బహుమతిని నేనెప్పుడూ ఊహించలేదు’’ అని చెప్పారు చైతన్యరెడ్డి. ‘‘హను మాన్’ 2డీ వెర్షన్ను ఎంతగా ఆస్వాదించారో అంతే అద్భుతంగా 3డీ వెర్షన్నూ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘దాదాపు 600మంది టెక్నీషియన్లు మూడునెలలపాటు శ్రమించి, 3డీ వెర్షన్ను అద్భుతంగా సిద్ధం చేశారు’’ అని చెప్పారు కిరణ్.


