వాణీనాథ్, శరణ్య, సమైరా, విజయశాంతి, మధు యాష్కీ, అభినయ కృష్ణ, యశ్వంత్
‘‘మంచి సబ్జెక్ట్ ఉన్న చిన్న సినిమాలను విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను. నిజానికి చిన్న సినిమాల్లో దమ్ముంటుంది. మేమందరం చిన్న సినిమాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాం’’ అన్నారు విజయశాంతి. సమైరా, సముద్ర ఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్ నటించిన సినిమా ‘కర్మాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.
తొలుత ‘కామాఖ్య’ టైటిల్ని ఖరారు చేసిన యూనిట్ తాజాగా ‘కర్మాఖ్య’గా మార్చింది. ఈ టైటిల్ మార్పును తెలియజేస్తూ, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ను గురవారం నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కామాఖ్య అమ్మవారు పవర్ఫుల్. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందనుకున్నా. అయితే ఇప్పుడు ‘కర్మాఖ్య’ అని పెట్టారు.
అందులోనూ అమ్మవారి పేరు ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుంది. నాకు ట్రైలర్ నచ్చింది. ఈ ట్రైలర్లోని మ్యూజిక్లో ఒక వైబ్రేషన్ వినిపించింది. ఈ సినిమాకు నిర్మాతలు చాలా ఖర్చుపెట్టారు’’ అన్నారు. ‘‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది’’ అన్నారు మధు యాష్కీ. ‘‘ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రానికి హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటాను’’ అని తెలిపారు అభినయ కృష్ణ. ‘‘మా సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సునీల్ నారంగ్, నవీన్గార్లకు థ్యాంక్స్’’ అని అన్నారు వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్. నటి శరణ్య ప్రదీప్, నిర్మాత రవికుమార్ పనస మాట్లాడారు.


