
సినిమా చూడొద్దని ప్రేక్షకులను బెదిరించకూడదు
నిరసన సంఘాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
ఉద్రిక్తతలు చెలరేగకుండా చూసే బాధ్యత రాష్ట్ర సర్కార్దే
స్పష్టం చేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ: కన్నడ భాషపై ప్రముఖ నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారిన థగ్లైఫ్ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదలచేయాల్సిందేనంటూ థగ్లైఫ్ చిత్రబృందానికి అనుకూలంగా ఉత్తర్వులిచి్చంది. రాష్ట్రంలో సినిమా విడుదల వేళ భాషా సంబంధ నిరసన సంఘాలు ఎలాంటి అవాంతరాలు సృష్టించకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా అంతా సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది.
సినిమా చూడొద్దని ప్రేక్షకులపై ఎవరూ తుపాకీ తలకు గురిపెట్టకూడదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘సినిమా విడుదలను, సినిమాను అడ్డుకునేందుకు అల్లరిమూకలు, నిరసనసంఘాలు వీధుల్లో వీరంగం ఆడతామంటే ఒప్పుకోం. శాంతిభద్రతలకు సంబంధించి చట్టాన్ని తూ.చ. తప్పకుండా ఖచి్చతంగా అమలుచేయాల్సిందే. ఆందోళనకారుల ఆగడాలను మేం అస్సలు సహించం. ఏదైనా అంశంపై ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలుచేస్తే ఇంకొరు దానిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రతి విమర్శలు చేయొచ్చు. అంతేగానీ సినిమా విడుదలను అడ్డుకోకూడదు’’అని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు. సినిమా విడుదల విషయంలో మీ వైఖరి ఏంటో జూన్ 18వ తేదీకల్లా చెప్పాలని కర్ణాటక ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది.