ఒకప్పుడు రోజంతా కష్టపడి కడుపు నిండా తినేవాళ్లు. పెద్దగా ఇబ్బందులు లేకుండానే ఏళ్లకు ఏళ్లకు ఆరోగ్యంగా బతికేసేవాళ్లు. కానీ ప్రస్తుతం ఏం తిన్నా గానీ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్ అని లెక్కలేసుకుంటున్నారు. మరికొందరైతే రోజుకి ఒకటి రెండుసార్లు అది కూడా చాలా తక్కువ మొత్తంలో తింటున్నవాళ్లు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు చాలామంది రకరకాల డైట్స్ పాటిస్తున్నారు. ఇవన్నీ పక్కనబెడితే సలార్, కేజీఎఫ్ సినిమాల సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్.. తన రోజువారీ డైట్ గురించి చెప్పి షాకిచ్చాడు.
(ఇదీ చదవండి: ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?)
రవి బస్రూర్ సంగీతమందించిన లేటెస్ట్ సినిమా 'టాక్సిక్'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది గానీ అస్సలు ఆడలేదు. దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ సంగీత దర్శకుడు.. తను ప్రతిరోజూ రెండు చపాతీలు, షాహీ పన్నీర్ కర్రీ మాత్రమే తింటానని మరేం తిననని అన్నాడు. కావాల్సినంత నీరు తాగి, కంటినిండా నిద్రపోతానని చెప్పాడు. ఇలా చేయడానికి కారణం కూడా చెప్పాడు.
హిమాలయాల్లో ఉండే చాలామంది ఎలాంటి ఆహారం తీసుకోకుండానే 15-20 ఏళ్లు బతుకుతున్నారని.. తన డైట్కి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు. అయితే రవి బస్రూర్కి సాధ్యమైన ఈ డైట్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మన శరీరానికి ఆకుకూరలు, కూరగాయలు, అన్నం, పప్పలు, మాంసకృత్తులు ఇలా చాలా కావాల్సి ఉంటుంది. ఏవి అందకపోయినా సరే పోషకాహార లోపం వచ్చే అవకాశముంటుంది. మరి ఇలాంటివేం తినకపోయినా సరే 'సలార్' సంగీత దర్శకుడు ఎలా మేనేజ్ చేస్తున్నాడనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న.
స్వతహాగా స్వర్ణకారుడు అయిన రవి బస్రూర్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ప్రభాస్ 'సలార్'కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నీల్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్'కి ఇతడే సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్లో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: ప్రశాంత్ నీల్ నిర్మాతగా హారర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)


