ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా, రచయితగా పరిచయమవుతున్న తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా'. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నర్సాపురం, విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా హీరో, రైటర్ ఉలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. "ఇదొక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతూ మిమ్మల్ని అలరిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలి" అని కోరారు.
ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు కళ్యాణ్ కృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక వీడియో సందేశం (AV) ద్వారా ఆయన మాట్లాడుతూ.. "నేను ఇప్పటికే సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. చిత్ర బృందం కొత్తవారైనప్పటికీ, చాలా పరిణతితో అద్భుతంగా నటించారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమా చూడండి" అని చిత్ర యూనిట్కు ఆశీస్సులు అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది.


