
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అసంతృప్తి తెలిపారు. విడుదలైన ప్రతి సినిమాకు అలా ధరలు పెంచుకుంటూ పోతే ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్నారు. క్రమేపి వారు థియేటర్కు వచ్చి సినిమా చూడటం తగ్గిస్తారని సూచించారు. చవకగా దొరికే వినోదం ఇప్పుడు చాలా ఖరీదుగా మారిపోయందని అభిప్రాయపడ్డారు. ఇకనుంచి అయినా సరే టికెట్ ధరలు పెంపు అంశంపై అందరూ ఒకసారి పరిశీలించాలని ఆయన కోరారు.
'భారీ ఖర్చుతో సినిమాలు తీయడం మంచిదే. కానీ, ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు. హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదు. మన తెలుగులో ఐదేళ్ల పాటు లవకుశ తీశారు, ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమాలు బాగుంటే తప్పకుండా జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడలేని పరిస్థి వస్తుంది.' అని ఆర్ నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ కోసం గద్దర్ అవార్డులను ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు. విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.