'ప్రణయ గోదారి' పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ విడుదల | Pranaya Godavari First Glimpse Out Now | Sakshi
Sakshi News home page

'ప్రణయ గోదారి' పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ విడుదల

Jul 20 2024 7:42 PM | Updated on Jul 20 2024 7:56 PM

Pranaya Godavari First Glimpse Out Now

టాలీవుడ్‌లో రొటీన్‌ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాల పట్ల ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ప్రముఖ హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తుంది. సునిల్ రావినూతల ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇందులో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. పెదకాపు అనే పాత్రలో ఆయన కనిపించనున్నారు. సాయికుమార్‌ ఫస్ట్‌ లుక్‌ను తెలంగాణ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ.. `ప్రణయగోదారి ` గ్లింప్స్‌ చాలా బాగుంది. కంటెంట్‌ చూస్తుంటే తప్పనిసరిగా అందరికి నచ్చుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ  చిత్రంలో సాయికుమార్ డైలగ్స్ అన్నీ చాలా ఆసక్తిగా ఉండటమే కాకుండా  పవర్‌ఫుల్‌గా వున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో  చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు' అన్నారు.

ప్రణయగోదారి సినిమా గ్లింప్ల్‌ చూస్తుంటే.. సన్నివేశాలు.. సంభాషణలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సాయికుమార్ ఈ సినిమాలో  పెదకాపు పాత్రలో  ఊరి పెద్దలాగా  కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగులు భారీగా పేలుతున్నాయి. 'తప్పు ఎవరు చేసినా తీర్పు ఒక్కటే'...'ఆకాశానికి హద్దుండదు ఈ పెదకాపు మాటకు తిరుగుండదు'.  'నే పుట్టిన ఈ గోదారి తల్లి మీద ఒట్టు' అని సాయికుమార్ తన పవరఫుల్ డైలాగులతో  మెస్మరైజ్ చేశాడు. 'ప్రాణం పోయినా సహిస్తాను.. భరిస్తాను ..నా సహనాన్ని.. మంచితనాన్ని పరీక్షించొద్దు' అనే డైలాగుతో  చాలా రౌద్రంగా కనిపిస్తున్నారు. 

గ్లింప్స్‌లో ఆయన పాత్రలోని గంభీరత్వం  కూడా  కనిపిస్తుంది. గ్లింప్స్‌ను చూస్తే సినిమా మొత్తానికి సాయికుమార్ పాత్ర  చాలా ముఖ్యమైనదిగా తెలుస్తుంది. గోదారి నది ఒడ్డున హీరో హీరోయిన్ల  ఆటలు, వారి ప్రేమాయణం సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రంలో యువతను అలరించే అంశాలు కూడా వున్నట్లు తెలుస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement