ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులందరి మధ్య డిస్కషన్కి కారణమైన మూవీ 'ది ఒడిస్సీ'. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు రూ.2000 కోట్లతో నిర్మించారు. గ్రీకు పురాణాల్లోని ఒడిసియస్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ మూవీని తీశారు. అందరూ మూవీని చూడాలని తెగ ఎగ్జైట్ అవుతుంటే ఓ మహిళ అభిమాని మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది.
(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)
గతేడాది ఓ సందర్భలో అమెరికా కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల అంబర్ కానగన్కి రెండో బిడ్డ గురించి ఆలోచించమని తన స్నేహితురాలు చెప్పింది. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఐమ్యాక్స్ 70ఎమ్ఎమ్లో తొలిరోజు 'ది ఒడిస్సీ' చూడటం కుదరదని, అందుకే బిడ్డని కనే ప్లాన్ వాయిదా వేసుకుంటానని చెప్పింది. మూవీ రిలీజ్ సందర్భంగా సదరు మహిళాభిమాని, హాలీవుడ్ ప్రముఖ వెబ్సైట్ 'వెరైటీ'తో ఇదంతా చెప్పడంతో ఈ సంగతి బయటపడింది.
అంబర్ మాత్రమే కాదు ఈ సినిమా కోసం మరెందరో అభిమానులు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. ఎలాగైనా ఐమ్యాక్స్ థియేటర్లలోనే ఈ మూవీ చూడాలని.. అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు విమాన ప్రయాణాలు చేసి, గంటల తరబడి వర్చువల్ క్యూల్లో ఉండి మరీ 'ది ఒడిస్సీ' చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. ఈ మూవీని పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో తీశారు. ప్రపంచవ్యాప్తంగా 40 మాత్రమే ఐమ్యాక్స్ థియేటర్లలు ఉండటంతో ఆయా థియేటర్లలో టికెట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఏడాది క్రితమే టికెట్ సేల్స్ ప్రారంభించగా, ఎక్కువ శాతం షోలు గంటల వ్యవధిలోనే హౌస్ఫుల్ కావడం విశేషం.
ప్రాచీన గ్రీకు కవి హోమర్.. మూడు వేల ఏళ్ల క్రితం రచించిన 'ది ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ట్రోజన్ యుద్ధం తర్వాత తన రాజ్యం ఇథికాకు తిరిగెళ్లే క్రమంలో ఒడిసియస్ రాజు.. సముద్ర ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది స్టోరీ. సినిమాలో ఒడిసియస్ పాత్రలో మ్యాట్ డామన్ నటించగా.. మిగిలిన పాత్రలని ఆన్ హాత్వే, టామ్ హాలండ్ తదితరులు పోషించారు.
(ఇదీ చదవండి: 'ది ఒడిస్సీ' సినిమా ట్విటర్ రివ్యూ)


