దక్షిణాది సినిమాలో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తమిళ నటుడు మైమ్ గోపి. తమిళం, తెలుగు ,మలయాళం తదితర భాషల్లో వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ఈయన తాజాగా కథానాయకుడుగా అవతారం ఎత్తబోతున్నారు. ఇంతకుముందు యువర్ పేకర్స్ అనే ఓటిటి సంస్థ అధినేత కిశోర్ ఆధిత్య పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు.
కాగా తాజాగా నటుడు మైమ్ గోపి హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంతోష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది పలు సంచనాలతో కూడిన హారర్ కథా చిత్రంగా ఉంటుందని, కాలక్షేప కథాచిత్రమే కాకుండా మహిళల రక్షణ వంటి అంశాలతో సమాజానికి మంచి సందేశాత్మక కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత కిశోర్ ఆధిత్య పేర్కొన్నారు.
వైవిద్య భరిత కథ, కథనాలు ముఖ్యంగా మహిళల రక్షణ , దానికి సంబంధించిన అవగాహన వంటి అంశాలు చోటు చేసుకోవడం వల్లే తానే చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు.చిత్ర షూటింగును ఊటీ, కొడైకానాల్ తదితర ఎత్తైన కొండ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎలాంటి పాత్రలోనైనా నటించి తన ప్రతిభ చాటుకుంటున్న నటుడు మైమ్ గోపి ని ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేయటం గర్వ కారణంగా పేర్కొన్నారు.. చిత్ర టైటిల్ను, ఇందులో నటించే కథానాయకి, ఇతర నటినటంలు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. మొత్తానికి తొలి చిత్రంతోనే మైమ్ గోపి ఓ ప్రయోగం చేస్తున్నాడు. మరి హీరోగా నిలదొక్కుకుంటాడా లేదా సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది.


