విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’(AK 47). ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి, నారా రోహిత్, నివేతా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ను ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్, శ్రీనిధి శెట్టి పాత్రలను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా యువినా పార్థవి క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో చిట్టిబాబుగా వెంకీ, స్వర్ణగా శ్రీనిధి నటిస్తున్నారు.
చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి. కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


