
కన్నప్ప మూవీ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరిని కించపరిచేలా కన్నప్ప సినిమాను తీయలేదని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు వెల్లడించారు. కాగా.. ఈ మూవీలోని పాత్రల పేర్లపై ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు స్పందించారు.
అసలేంటి వివాదం..?
ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది కన్నప్ప టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గుంటూరు కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ వివాదంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.
కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి అగ్రతారలు నటించారు.