సంక్రాంతి రభస: మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్‌ ఫిర్యాదు | Manchu Manoj Complaint on Mohan Babu, Vishnu Over Sankranti Incident | Sakshi
Sakshi News home page

అభిమానులపై దాడి.. తండ్రి, సోదరుడిపై మంచు మనోజ్‌ ఫిర్యాదు

Jan 16 2025 1:25 PM | Updated on Jan 16 2025 3:21 PM

Manchu Manoj Complaint on Mohan Babu, Vishnu Over Sankranti Incident

తన అభిమానులపై దాడి చేయించినందుకుగానూ తండ్రి మోహన్‌బాబు (Mohan Babu), సోదరుడు విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచు మనోజ్‌ (Manchu Manoj) జనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు పుట్టాక వచ్చిన మొదటి పండగకు కూడా ఇంటికి రానివ్వడం లేదు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. 

మా ఇంటి విషయాన్ని ఎవరితో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. కానీ మా కుటుంబ విషయాలేవీ ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు అన్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మనోజ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో ఎడమవైపు నొప్పి రావడంతో పోలీస్‌ స్టేషన్‌ వెనక కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.

ఏం జరిగిందంటే? 
మనోజ్‌, భార్య మౌనికతో కలిసి బుధవారం నాడు తిరుపతికి వెళ్లాడు. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్‌తో 25 నిమిషాలపాటు భేటీ అయ్యాడు. అనంతరం శ్రీవిద్యానికేతన్‌ స్కూల్‌కు 200 మందితో ర్యాలీగా వెళ్లాడు. అప్పటికే సిబ్బంది గేట్లు మూసివేయగా పోలీసులు భారీగా మెహరించారు. ఆయన స్కూల్‌ లోపలకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు కోర్టు ఉత్తర్వులను చూపించారు.

సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా..?
పండుగ పూట తాత, నానమ్మల సమాధుల వద్దకు కూడా వెళ్లనివ్వరా అని మనోజ్‌ అసహనం వ్యక్తం చేశాడు. తనను అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానన్నాడు. మోహన్‌బాబు యూనివర్సిటీ సమీపంలోని డెయిరీ వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు మనోజ్‌. అక్కడ అతడి అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవే­టు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్‌ అనుచరులు వారిపైకి రాళ్లు విసరడంతో వారిపై మోహన్‌బాబు బౌన్సర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ మనోజ్‌.. భార్యతో కలిసి నానమ్మ, తాతల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు.

చదవండి: మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో

Advertisement
 
Advertisement
Advertisement