50 భాషల్లో ‘వారణాసి’ విడుదల
తెరపై కనిపించే తారలు వేరు... వాళ్లు పలికే సంభాషణలు పలికేవాళ్లు వేరు. మరి... తెరపై కనిపించే వ్యక్తి హావభావాలకు తగ్గట్టుగా సంభాషణలు పలికే వ్యక్తి కంఠస్వరం ఉండాలి కదా. ప్రస్తుతం రాజమౌళి అలా మ్యాచ్ అయ్యే ‘వాయిస్’ల కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. మహేశ్బాబు హీరోగా తాను తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసమే రాజమౌళి దాదాపు పదిహేను వందల మంది వాయిస్ ఆర్టిస్ట్లను పరిశీలించి, మ్యాచ్ అయ్యేవారితో డబ్బింగ్ చెప్పించాలని అనుకుంటున్నారట.
ఇంతకీ 1500 మంది ఆర్టిస్ట్లు ఎందుకు అంటే... ‘వారణాసి’ని ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మిగతా భాషల్లోనూ అనువదించి, విడుదల చేస్తారు. సో... పాత్రలకు సరిగ్గా సరి పోయే గొంతులను ఎంపిక చేసి, ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారట. ఇన్ని వాయిస్లంటే ఏఐ ద్వారా కూడా చేయొచ్చు.
కానీ, భావోద్వేగాలు సహజంగా ఉండాలంటే మనుషులతోనే మాట్లాడించాలనుకుంటున్నారట. అందుకే ‘రియల్ వాయిస్’లను ఎంపిక చేయాలనుకుంటున్నారని భోగట్టా. రాజమౌళి టీమ్ ప్రస్తుతం ఈ ఆడిషన్స్ చేసే పని మీద ఉందని తెలిసింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 120 దేశాల్లో 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.


