
ఆయన ఏ వేషం వేసినా.. దానికో ప్రత్యేక గుర్తింపు. తన చుట్టూ ‘కోటన్నా..’ అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు.. ‘తంబీ, వారీ..’ అని ఆయన తెరపై పిలిచే పిలుపు.. ఆడియొన్స్కి వినసొంపు. నైజాం యాస అయినా.. మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్లుగా మార్చుకోవడం ఆయన తరీఖా. కడుపుబ్బా నవ్వించడంలో.. క్రూరత్వంతో భయపెట్టించడంలో ఆయనదో ప్రత్యేకమైన మార్క్. నటనకు పెట్టని ‘కోట’గా తెలుగు సినీ పరిశ్రమలో వెలుగొందిన కోటా శ్రీనివాసరావు నేడు (జులై 13) ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన గురించి కొన్ని విషయాలు..
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయులు సంతానమే కోటా శ్రీనివాసరావు. కోట 1945, జులై 10న జన్మించాడు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయాడు. నటనపై ఇష్టంతో బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నాడు. ‘ప్రాణం ఖరీదు’తో మొదలైన ఆయన నటన.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహితంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా దాదాపు 750 సినిమాల దాకా నటించిన(అంతకు మించి) కోట.. ప్రతీ సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చారు..
'గణేష్'తో అసలు సిసలైన విలనిజం
నాకైతే చార్మినార్కున్నంత హిస్టరున్నది! సాంబశివుడికి నాన్చడం ఇష్టం ఉండదు. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఇష్టం ఉండదు. సూటిగా విషయంలోకి వస్తాడు.
'తమ్మీ... ఇస్టేటుగా పాయింట్లకు వస్తున్న.
నీ ఫైళ్ల ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్టే.
నేను యాభై కోట్ల కుంభకోణం చేసిన... కాదంటలే!
మరి నాకైతే చార్మినార్కున్నంత హిస్టరున్నది'.
హీరో డైలాగులు కొడితే చప్పట్లు కొట్టడం అనేది సాధారణమే కావచ్చుగానీ, తమ డైలాగులతో కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోగలిగే విలన్లలో కోట శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. 'గణేష్' సినిమాలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడిగా ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. విలనిజంలో అసలు సిసలు 'స్థానికత'ను తీసుకువచ్చారు కోట.
విలన్ మాత్రమే కాదు..
తొలినాళ్లలో సైడ్కిక్ వేషాలేసిన కోట.. క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లాడు. ప్రతిఘటన ‘యాదగిరి’ కోట నటనను ఆడియెన్స్కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని ‘కామెడీ’ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని.. తర్వాతి కాలంలో కోట్లమందిని కోటకు అభిమానులు చేసింది. ఆ సినిమా పేరు ‘ఆహానా పెళ్లంట’. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన.. మధ్యమధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ‘గణేశ్’ హోం మినిస్టర్ సాంబ శివుడు లాంటి పాత్రల్లోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే!.
అన్నాయ్.. అంటూ
తొంభై దశకంలో కోట సినీ ప్రయాణం ప్రయాణం జెట్ స్పీడ్తో సాగింది. మెయిన్ విలన్, కామెడీ విలన్గానే కాకుండా.. విలన్ పక్కన ఉంటూ ‘గోడ మీద పిల్లి’ తరహా క్యారెక్టర్లతో అలరించారాయన. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్-కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అన్న.. అన్నాయ్..’ అంటూ కోటను బాబు మోహన్ బురిడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు.. సన్నివేశాల్ని రిపీట్ మోడ్లో చూసి నవ్వుకునే వాళ్లూ ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమోగానీ.. కోటలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఇవీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మీ, ఎమ్మెస్ నారాయణ కాంబోలోనూ కోట నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది.
మందు పడితేనే ఆ సీన్ పండిందట
కోటకు వివాదాలు కొత్తేం కాదు. పరభాష నటులను విలన్లుగా తీసుకోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆయన కూడా ఇతర భాషల్లో నటించిన ప్రస్తావనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నటన రానీ వాళ్లను తీసుకోవడం గురించే తాను మాట్లాడానని తర్వాత క్లారిటీ ఇచ్చారు కోట. ఇక కోటకు మద్యం బలహీనత ఉందని, తాగి సెట్కి వస్తారని, దీంతో కొందరు ఆర్టిస్టులు ఇబ్బందిగా ఫీలయ్యేవారన్న అపవాదు కోట మీద ఉంది. అయితే సిచ్యుయేషన్కి తగ్గట్లు కొన్నిసార్లు అది తప్పదనే కోట సమర్థనను బలపరిచిన వాళ్లూ లేకపోలేదు. అందుకు ఉదాహరణగా శుత్రువు టైంలో జరిగిన ఓ ఘటను గుర్తు చేస్తారు. విలన్ క్యారెక్టర్ కోసం.. అప్పటికే ఇద్దరు యాక్టర్లను మార్చేసిన కోడిరామకృష్ణ చివరికి కోట దగ్గర ఆగిపోయాడు. అయితే ఒక సీన్ తీస్తున్న టైంలో కోట పదే పదే టేకులు తీసుకుంటుండడంతో అంతా విసిగిపోయారట. చివరికి పక్కకు వెళ్లి మందేసి వచ్చిన కోట.. తర్వాత ఆ సీన్లో చెలరేగిపోయాడు. ఆ సీన్కు ఆడియొన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చిందని దర్శకుడు కోడిరామకృష్ణ సైతం కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం విశేషం.
గదైతే ఖండిస్తం
గాయం సినిమాలో 'గదైతే నేను ఖండిస్తున్న' అంటూ గురు నారాయణ్గా కోట పాత్ర ఎవరూ మరిచిపోలేరు. తెలంగాణ యాసలో జర్నలిస్ట్గా ఉన్న రేవతి అడిగే ప్రశ్నలకు కొట పలికిన సంభాషణలకు చాలామంది ఫిదా అయ్యారు. 'ఈ డెవడ్రా బాబూ..', 'నాకేంటి .. మరి నాకేంటి', 'మరదేనమ్మా నా స్పెషల్' వంటి కోట నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పకోవాలి. పొలిటీషియన్గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తుంటుంది. ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేశ్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళ్ సామి, కో(రంగం), సర్కార్(హిందీ) సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.
గొంతుతోనూ మ్యాజిక్
90 దశకంలో, 2000 సంవత్సరాల్లోనూ తన డబ్బింగ్ వాయిస్తో కోట అలరించాడు. ముఖ్యంగా తమిళ కమెడియన్ గౌండ్రమణి(అవతల సెంథిల్కు బాబు మోహన్)కి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివణ్ణన్కు సైతం ఆయన కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.
బాబు మోహన్తో ఎనలేని బంధం
కోటశ్రీనివాసరావు, బాబు మోహన్లు 'అన్నదమ్ములు'గా కనిపించేవారు. అన్నయ్యా అంటే చాలు కోట తనకోసం ఏమైనా చేస్తారని బాబు మోహన్ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలో వీళ్లిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఒక సినిమాలు వీళ్లు ఇద్దరూ ఉంటే చాలు అది దాదాపు సగం విజయం సాధించినట్లే అనుకునేవారు. ముత్యాల సుబ్బయ్య తీసిన ‘మామగారు’ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. అందులో వారిద్దరు చేసిన కామెడీకి పొట్టచెక్కలయ్యేలా ఎవరైనా నవ్వాల్సిందే.. ఈ సినిమా భారీ విజయం వెనుక వీళ్లిద్దరి కామెడీ చాలా కీలకంగా పనిచేసిందని దర్శకులు కూడా చెప్పారు. కోటశ్రీనివాసరావు, బాబు మోహన్లు ఇద్దరు కలిసి దాదాపు 65కు పైగా సినిమాల్లో నటించారు.
కోట జీవితంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు
- 2015లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డ్తో కోటను సత్కరించింది.
- 9 నంది అవార్డులను కోట శ్రీనివాసరావు అందుకున్నారు.
- కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాకు గాను సైమా అవార్డ్
- అల్లు రామలింగయ్య పురష్కారం
- విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయిన కోటా
- దాదాపు 750 పైగా చిత్రాల్లో నటించిన కోటా
- ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును భర్తీ చేసిన నటుడిగా గుర్తింపు
- 2003లో సామితో తమిళ పరిశ్రమలో విలన్గా అరంగేట్రం చేశారు.
- కోట నటించిన చివరి చిత్రం సువర్ణ సుందరి (2023)
- 1968లో రుక్మిణితో వివాహము.. కోటాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.
- 2010 జూన్ 21లో రోడ్డు ప్రమాదంలో మరణించిన కోటా కుమారుడు ప్రసాద్