
సింగిల్ పేరెంటింగ్ అన్నది చాలా కష్టం. తల్లి/తండ్రి లేని లోటు తెలియకుండా పిల్లల్ని పెంచాలి. అమ్మానాన్న అన్నీ ఒక్కరై పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరి ప్రేమను ఒక్కరే పంచాలి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా అదే పని చేస్తున్నాడు. 2017లో సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యాడు. అప్పటినుంచి అన్నీ తానై పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. ఆ చిన్నారులకు తల్లి లేకుండా చేశావని నిర్మాతను విమర్శించారు. ఆ మాటలు తననెంతగానో బాధపెట్టాయంటున్నాడు కరణ్ జోహార్.
నాపై నాకే అనుమానం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. నీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావన్న విషయం నీకర్థమవుతోందా? అన్న కామెంట్లు చూసి భరించలేకపోయాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అని నామీద నాకే అనుమానమేసింది. అప్పుడు వెంటనే పిల్లల గదిలోకి వెళ్లాను. అప్పుడు వారి వయసు ఐదేళ్లుంటాయంతే! మీరు సంతోషంగానే ఉన్నారా? అని అడిగాను. నువ్వు మా నాన్నవి కాబట్టి హ్యాపీగా ఉన్నామన్నారు. నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూశాను.
సింగిల్ పేరెంట్గా..
వారి రెస్పాన్స్ విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకనవసరం అనిపించింది. సింగిల్ పేరెంట్గా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యాను. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్గా ఉన్నాను. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా నా కుటుంబం, స్నేహితులు.. వీళ్లెప్పుడూ నా వెన్నంటే ఉంటారు. అందుకు గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు