
థగ్లైఫ్(Thug Life ) చిత్రం ఏ ముహూర్తాన మొదలైయిందో గానీ, విడుదల నుంచి వరుసగా అవరోదాలను, అవమానాలను, నష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం థగ్లైఫ్. నటుడు శింబు, త్రిష , నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పుడైతే కర్ణాటకలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన నటుడు కమలహాసన్ తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచే ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. థగ్లైఫ్ చిత్ర విడుదలను కన్నడిగులు అడ్డుకున్నారు.
కర్ణాటక హైకోర్టు కూడా నటుడు కమలహాసన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఆయన్ని క్షమాపణ చెప్పాలని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు చిత్ర విడుదలను అడ్డుకోరాదని, పోలీసులు రక్షణ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చిత్రానికి భద్రత కల్పించనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియేసింది. అయితే థగ్లైఫ్ చిత్రం ఇప్పటి వరకూ కర్ణాటకలో విడుదల కాలేదు. అదేవిధంగా విడుదలయిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, తమ డబ్బును వాపస్ చేయాల్సిందిగా డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే థగ్లైఫ్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం క్షమాపణ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే చిత్రం ప్లాప్ అవడంతో ఇప్పుడు రూ. 90 కోట్లే ఇస్తాయని మడత పేచీ పెట్టిందని, చివరికి చర్చలనంతరం రూ. 110 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం.
అదే విధంగా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లు రూ. 25 లక్షలు జరిమానా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం నటుడు కమలహాసన్ థగ్లైప్ చిత్రం విడుదలై 8 వారాల తరువానతనే ఓటీటీలో ప్రసారం చేస్తామని చెప్పారనీ, అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో మల్టీఫ్లెక్స్ థియేటర్లు రూ.25 లక్షలు అపరాధం వేసినట్లు సమాచారం. ఇలా ఈ చిత్రం దెబ్బ మీద దెబ్బను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.