
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ యాక్షన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.29 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.
తొలి రోజు రూ.15 కోట్లకు పైగా రాబట్టిన థగ్ లైఫ్.. రెండో రోజే ఏకంగా సగానికి పడిపోయింది. అయితే మూడో రోజు వీకెండ్ కావడంతో శనివారం రూ. 7.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే రూ. 30 కోట్ల మార్కును దాటలేకపోవడంతో కమల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'థగ్ లైఫ్' 3వ రోజు దాదాపు రూ. 60 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మణిరత్నం గత విజయాలతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 మరియు పార్ట్ 2', రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. థగ్ లైఫ్ వసూళ్ల పరంగా రాణించకపోవడంతో కమల్ ఖాతాలో ఈ మూవీ డిజాస్టర్గానే మిగలిపోయేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు.