
ఎరుపు రంగు గౌనులో తళతళ తారకలాగా తళుక్కుమని ప్రత్యక్షమయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఆమె ‘రెడ్ సీ ఫెస్టివల్’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. అలాగే మహిళా నిర్మాతలు, నటులు, సాంకేతిక విభాగంలో ఉన్నవారు సినిమాలకు చేసిన కృషిని ప్రస్తావించే ‘ఉమెన్ ఇన్ సినిమా’ గాలాలో పాల్గొనే గౌరవం జాక్వెలిన్కి దక్కింది. ఇక భారతదేశం నుంచి ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్ పై తళుక్కుమన్న తారల్లో హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో నటించిన నితాంశా గోయల్ తొలిసారి పాల్గొన్నారు.
గత ఏడాది గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ లైట్’లో నటించిన ఛాయా కదమ్ ఆ 77వ చిత్రోత్సవాల్లో సందడి చేశారు. ఈ ఏడాదీ ఆమె కాన్స్ వెళ్లారు. ఇంకా భారతదేశం నుంచి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మాసూమ్ మీనావాలా, ఇండియన్–థాయ్ బ్యూటీ, ‘మిస్ యూనివర్స్ థాయ్ల్యాండ్ సరాబురి’ వీణా ప్రవీణర్ సింగ్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింద్వానీ పాల్గొన్నారు. ‘తన్వీ ది గ్రేట్’ స్క్రీనింగ్ కోసం హాజరైన ఆ చిత్రదర్శకుడు అనుపమ్ ఖేర్ కూడా రెడ్ కార్పెట్పై స్టైలిష్గా కనిపించారు.