రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్-2 చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు రజనీ మాజీ అల్లుడు ధనుష్ తన 55వ చిత్రాన్ని కూడా దీపావళి టార్గెట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే.. కోలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. అంటే ఒకప్పుడు మామఅల్లుళ్లు.. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నారన్నమాట.
నిజానికి జైలర్-2 సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. అయితే రీషూట్స్ కారణంగా సినిమా పలుమార్లు డిలే అవుతూ వచ్చింది. ఇక అలా వాయిదాలు పడుతూ ఆకరికి దీపావళి బరిలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే అటు ధనుష్ మాత్రం తన సినిమా ప్రారంభం నుంచి అక్టోబర్ నెల రిలీజ్ టార్గెట్ గానే తన సినిమాను రెడీ చేస్తున్నాడు.
ఈ విషయంలో ప్రాక్టికల్గా చూసుకుంటే సూపర్స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్తో ధనుష్ పోటీ పడే అవకాశం లేదు. కానీ వీళ్ల మధ్య ఉన్న పాత బంధం కారణంగా ఈ బాక్సాఫీస్ క్లాష్ అందర్నీ ఆకర్షించే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ధనుష్ తన సినిమాని థియేటర్లలోకి తెచ్చేంత సాహసం చేయడంటున్నారు మరికొంతమంది. ధనుష్ సినిమాలన్నీ కూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతాయి. దాంతో బరిలో రజనీకాంత్ ఉన్నా ధనుష్ తగ్గకపోవచ్చని అంటున్నారు మరికొంతమంది. చూడాలి ఈ ఆసక్తికర పోరులో చివరికి ఏమౌతుందో.
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ 2004లో వివాహం చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో వారి 18 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడిచి 2022లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అనంతరం 2024లో కోర్టు వీళ్లకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.


