
ఓటీటీలు అనగానే చాలామందికి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ తరహా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా అలానే ఓటీటీలోకి వచ్చిన చిత్రం 'జెంటిల్ ఉమన్'. ట్రెండింగ్ టాపిక్ బేస్ చేసుకుని ఈ మూవీ తీయడం విశేషం. ఇంతకీ దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)
కథేంటి?
పల్లెటూరిలో పుట్టి పెరిగిన పూర్ణిమ అలియాస్ పూర్ణి (లిజోమోల్ జోస్) అరవింద్(హరికృష్ణన్)ని పెళ్లి చేసుకుని నగరానికి వస్తుంది. మూడు నెలలుగా ఉదయం లేవడం, పూజ చేయడం, భర్తకు వంట చేసి పెట్టడం, అతడి శారీరక అవసరాలని తీర్చడం. ఇదే ఈమె రొటీన్. అలాంటిది ఓ సందర్భంలో భర్తకు ఆని(లోస్లియా) అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. దీంతో భర్తని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంది. తర్వాత ఏమైంది? పోలీసులకు దొరికిందా లేదా? ఆని.. పూర్ణిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
పొద్దున్న లేస్తే చాలు.. ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, ప్రియురాలి కోసం భార్యని అడ్డు తొలిగించిన భర్త.. ఇలాంటి వార్తలే చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'జెంటిల్ ఉమన్'.
సినిమా మొదలవడమే చాలా కూల్ గా మొదలవుతుంది. పూర్ణిమ అనే గృహిణి. ఆమెకు రోజూ ఒకేలాంటి దినచర్య. మరోవైపు రోజూ దేవుడికి పూజ చేస్తూ ఫిలాసఫీ పుస్తకాలు చదివే భర్త. కట్ చేస్తే సరిగ్గా సినిమా అరగంట గడిచేసరికి మొదటి ట్విస్ట్. భర్త అక్రమ సంబంధం గురించి తెలిసి అప్పటివరకు శాంతంగా కనిపించిన పూర్ణిమ ఒక్కసారి వయలెంట్ అవుతుంది. భర్తని నరికి చంపి ఫ్రిజ్ లో పెడుతుంది.
మరోవైపు సదరు భర్త.. మరో మహిళతో ఎఫైర్ నడిపిస్తుంటాడు కదా. తన ప్రియుడు కనిపించట్లేదని ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. అక్కడ నుంచి పోలీసుల దర్యాప్తు. పూర్ణిమని పిలిచి విచారించడం. చివరకు ఏమైందనేదే స్టోరీ.

చాలా సాదాసీదాగా మొదలయ్యే సినిమా ఆద్యంతం నిదానంగానే వెళ్తుంది. కాకపోతే ప్రస్తుతం సమాజంలో పోకడల్ని కొంతవరకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకప్పటిలా భర్తలు అక్రమ సంబంధాలు అంటూ నడిపితే అరిచి గీ పెట్టడాలు, గొడవ పడటం లాంటివి కాకుండా భార్యలు ఎంతకు తెగిస్తున్నారు అనే చెప్పే స్టోరీ ఇది.
సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే ఈ సినిమా చూడొచ్చు. మరీ అంచనాలు పెట్టుకుంటే నిరాశపరచొచ్చు. రెండు గంటల్లోపే నిడివి కాబట్టి ఇలా మొదలుపెడితే అలా ముగించేయొచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎవరెలా చేశారు?
'జై భీమ్' సినిమాలో చినతల్లిగా అలరించిన లిజోమోల్.. ఇందులో పూర్ణిమగా అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఈమె భర్తగా చేసిన హరికృష్ణన్ ది చిన్న రోల్. ఉన్నంతలో ఓకే. ప్రియురాలిగా చేసిన లోస్లియా కూడా పాత్రకు తగ్గట్లు చేసింది. మిగిలిన పాత్రధారులు ఓకే.
టెక్నికల్ విషయాలకొస్తే ఇందులో పాటలేం లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీ మూడ్ కి తగ్గట్లు ఉంది. కెమెరా వర్క్ బాగుంది. దర్శకత్వం మాత్రం మీద కంప్లైంట్ ఉంది. చిన్న పాయింట్ నే చాలా సేపు సాగదీసినట్లు అనిపించింది. ఓవరాల్ గా చెప్పుకొంటే మాత్రం ఓసారి చూడొచ్చు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)