
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది గంగూలీ బయోపిక్. ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసినప్పటికీ తాజాగా ఈ సినిమా పట్టాలక్కనుంది వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సెన్సేషన్ మాలిక్ చిత్రంలో హీరోగా చేసిన రాజ్కుమార్ రావ్ గంగూలీ పాత్ర పోషించనున్నాడు. అది తప్ప ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో... గత కొంత కాలంగా ఊపందుకున్న క్రికెటర్ల బయోపిక్స్..వాటికి దక్కిన ప్రేక్షకాదరణను ఒక్కసారి పరిశీలిస్తే...

సచిన్..విన్
సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ఫిల్మ్ 2017లో విడుదల అయింది. ఇండియన్ క్రికెట్ గాడ్గా అభిమానులు పిలుచుకునే సచిన్ జీవితం ఆధారంగా ఇది పూర్తి స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్గా తయారైంది. కధ విషయానికి వస్తే సచిన్ బాల్య దశ నుంచి 2011 వరల్డ్ కప్ గెలుపు వరకు ఈ చిత్రంలో చూపించారు. ఇందులో సచిన్ స్వయంగా తన పాత్ర పోషించడం విశేషం. ఈ డాక్యుమెంట్రీ రూ.76 కోట్ల వరకూ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు, ఫ్యాన్స్ ఆదరణ దక్కించుకుంది.

థోనీ...ధనాధన్
మాజీ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోనీ ద అన్టోల్డ్ స్టోరీ 2016లో విడుదలైంది. ఇందులో థోనీ పాత్రను దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించాడు. ఇందులో కథ ధోనీ క్రికెటర్గా మారడం నుంచి భారత కెప్టెన్గా ఎదగడం దాకా కొనసాగుతుంది. ఈ సినిమా రూ.216 కోట్లు వసూలు బాక్స్ ఆఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సినిమాలో సుశాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా ధోనీ అభిమానుల ఆదరణ పొందింది.

అజహర్...యావరేజ్ సర్..
మహ్మద్ అజారుద్దీన్ జీవిత కధ ఆధారంగా రూపొందిన అజహర్ చిత్రం కూడా 2016లోనే విడుదలైంది. దీనిలో అజహర్ పాత్రను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి పోషించాడు. క్రికెటర్గా అజార్ కెరీర్ కొనసాగిన విధం, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వరకు సినిమా సాగుతుంది. మొత్తంగా రూ.50 కోట్లు వసూలు చేసి యావరేజ్ చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుంది.

మిథాలీ...సారీ...
మహిళల క్రికెట్కు భారత్లో చక్కని బాట వేసిన మిథాలి రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన శభాష్ మిథు..2022లో విడుదలైంది.ఇందులో మిథాలి పాత్రను బాలీవుడ్ నటి తాప్సీ పన్ను పోషించింది. భారత మహిళా క్రికెట్ తో పాటుగా ఎదిగిన మిథాలీ జీవితాన్ని చూపించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీసం రూ.2 కోట్లు కూడా వసూలు చేయలేక కమర్షియల్గా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా కథన శైలి, స్క్రీప్లేపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, మిథాలి పాత్రను తాప్సీ సమర్ధంగా పోషించిందని ప్రశంసలు రావడం ఒక్కటే ఈ సినిమాకు దక్కిన ఊరట.

కపిల్...కప్ ఫుల్...
కపిల్దేవ్ 83 పేరిట రూపొందిన చిత్రం భారత క్రికెట్ దిగ్గజం కపిల్ జీవితంలో ముఖ్య ఘట్టమైన ప్రపంచ కప్ విజయం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కపిల్ పాత్రను బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పోషించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం రూ.193 కోట్లతో మంచి వసూళ్లే రాబట్టినా, చిత్రం బడ్జెట్ ప్రకారం కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేకపోయింది. అయితే విమర్శలు ప్రశంసలు బాగానే అందుకుంది.
మొత్తం గా చూస్తే ధోనీ బయోపిక్ మాత్రమే అన్ని రకాలుగా విజయం సాధించింది అని చెప్పొచ్చు మరి గంగూలీ ఈ విషయం లో ధోని ని బీట్ చేయగలడా...