సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. తాజాగా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మొదటి జీతం గురించి వెల్లడించింది. తాజాగా నయనతారను ఆమె తొలి ఉద్యోగం గురించి అడిగారు. దీనికి స్పందించిన నయనతార.. తన మొదటి పని ఓ మ్యాగజైన్ కవర్ షూట్ అని గుర్తుచేసుకుంది. ఓ ఫ్యాషన్ కార్యక్రమం కోసం తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో తనకు వచ్చిన పారితోషికం కేవలం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు మాత్రమే అని నయనతార చెప్పింది. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన తన కెరీర్.. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగే స్థాయికి చేరుకోవడం విశేషం.
నయనతార చాలా కాలంగా సౌత్లో లేడీ సూపర్స్టార్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మోడలింగ్ ద్వారా సినీరంగం దృష్టిని ఆకర్షించిన ఆమె 2003లో ‘మనస్సినక్కరే’ సినిమాతో నటిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాగజైన్లో నయనతార ఫొటోలు చూసిన దర్శకుడు సత్యన్ ఆమెకు తొలి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ‘అయ్యా’, ‘చంద్రముఖి’ చిత్రాలతో తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది.
రజనీకాంత్తో చేసిన చంద్రముఖి సినిమా నయనతార కెరీర్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఆమె పాపులర్ అయింది. అదే టైమ్లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టింది. అవి సక్సెస్ కావడంతో తిరుగులేని లేడీ సూపర్స్టార్గా క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలతో లేడీ సూపర్స్టార్గా ఎదిగిన నయనతార 2023లో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’తో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంటే.. కేవలం రూ.3 వేలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో యశ్తో ఆమె నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది.


