
'గుంటూరు కారం' తర్వాత ఏడాదిన్నర నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ కోసం భారీ మైథలాజికల్ స్టోరీ ఒకటి సిద్ధం చేశారు. త్వరలో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనుకునే టైంలో బన్నీ లైనప్ మారింది. 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ని కాదని అట్లీతో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మాటల మాంత్రికుడు ఎదురు చూడక తప్పని పరిస్థితి. అలానే ఎవరితో సినిమా చేయాలా అని త్రివిక్రమ్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈయన గురించి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథని ఇప్పుడు ఎన్టీఆర్తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. అలా అని ఇది ఇప్పుడు మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. రామ్ చరణ్, వెంకటేశ్తో వరసగా మూవీస్ చేస్తారని, ఇవి పూర్తయిన తర్వాత తారక్తో మూవీ ఉండొచ్చని తెలుస్తోంది. అంతలో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్తో ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని వస్తాడని టాక్.
(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)
'అరవింద సమేత' తర్వాతే త్రివిక్రమ్-ఎన్టీఆర్తో మరోసారి పనిచేస్తారని కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అదే కథతో త్రివిక్రమ్.. 'గుంటూరు కారం' తీశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ఇది నిజమో కాదో సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరోసారి ఒకరు చేయాల్సిన స్టోరీతో మరో స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బన్నీ కూడా ప్రస్తుతం అట్లీతో చేస్తున్నాడు. ఒకవేళ కుదిరితే త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ ఉంటుంది. లేదంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా, పుష్ప 3 మూవీస్ ఉండనే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ సినిమా మిస్ అంటున్న వార్తలు నిజమేనా? లేదంటే పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో త్రివిక్రమ్-రామ్ చరణ్ మూవీ గురించి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?)