రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే షూటింగ్కు కాస్తా గ్యాప్ దొరకడంతో మహేశ్ బాబు విదేశాలకు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. తొలిసారి వీరిద్దరి వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకధీరుడు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.
అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందేమోనని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. బాహుబలిలా పార్ట్-2,3 కూడా ఉంటాయా? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వారణాసికి సీక్వెల్పై ఇప్పటి వరకు రాజమౌళి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్లోని ఆన్నెసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి ఈ విషయంపై స్పందించారు. వారణాసి'కి సీక్వెల్స్ ఉంటాయా అని అడగ్గా.. ఇది కేవలం ఒక సినిమా మాత్రమేనని.. సీక్వెల్ ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ఒక యూనిక్ మూవీగానే రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సీక్వెల్ ఉంటుందన్న ఊహగానాలకు రాజమౌళి చెక్ పెట్టారు.
కాగా.. వారణాసి మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్తో పాటు అడ్వెంచరస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తోంది.


