కాపీరైట్‌ కేసు.. హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కి భారీ ఊరట! | Director Shankar Gets Relief As Madras High Court From Enthiran Copyright Case | Sakshi
Sakshi News home page

కాపీరైట్‌ కేసు.. హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కి భారీ ఊరట!

Mar 11 2025 2:16 PM | Updated on Mar 11 2025 3:36 PM

Director Shankar Gets Relief As Madras High Court From Enthiran Copyright Case

కోలీవుడ్‌  డైరెక్టర్‌ శంకర్‌( Shankar )కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మద్రాస్‌ కోర్టు ఊరట కల్పించింది.  రోబో సినిమా కథ విషయంలో  కాపీరైట్‌(Copyright Case) ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను కొద్దిరోజుల క్రితమే  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. అయితే, ఈడీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలో తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.

తాను ఎలాంటి కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడలేదని మద్రాస్‌ హైకోర్టులో కొద్దిరోజల క్రితమే శంకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు (మార్చి 11) న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, ఎన్. సెంథిల్‌కుమార్‌ల సెషన్‌లో విచారణకు వచ్చింది. ఆ సమయంలో శంకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్.. రోబో సినిమా కథ విషయంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వారు గతంలోనే శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని గుర్తుచేశారు. అయినప్పటికీ  ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వారు శంకర్‌ ఆస్తులను జప్తు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.

దర్శకుడు శంకర్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి  తీర్పు ఇచ్చినప్పుడు తుది ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాయర్ స్పందిస్తూ.. నేరం రుజువైతే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చర్యల వల్ల డైరెక్టర్ శంకర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో ఈ కేసును ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. కానీ, ఈడీని కోర్టు తప్పబట్టింది. శంకర్‌ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు.

ఏం జరిగిందంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్‌ పేరుతో ఈ మూవీని శంకర్  తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్‌ తమిళనాథన్‌ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాపీరైట్‌ చట్టాన్ని ఆయన  ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక  శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు  మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్‌ కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement