ఆస్తుల జప్తుపై శంకర్‌ రియాక్షన్‌.. కోర్టు తీర్పును కూడా లెక్క చేయలేదంటూ.. | Director Shankar First Reaction On Enforcement Directorate | Sakshi
Sakshi News home page

ఆస్తుల జప్తుపై శంకర్‌ రియాక్షన్‌.. కోర్టు తీర్పును కూడా లెక్క చేయలేదంటూ..

Feb 22 2025 11:15 AM | Updated on Feb 22 2025 11:26 AM

Director Shankar First Reaction On Enforcement Directorate

కోలీవుడ్‌  డైరెక్టర్‌ శంకర్‌కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన తర్వాత ఆయన తొలిసారి రియాక్ట్‌ అయ్యారు. రోబో సినిమా కథ విషయంలో  కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. అయితే, తాజాగా శంకర్‌ స్పందించారు. ఈడీ నిర్ణయాన్ని తప్పబట్టారు.  కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ ఆయన పేర్కొన్నారు.  

ఈడీ విషయంలో శంకర్ ఇలా చెప్పుకొచ్చారు. 'ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీసుకున్న నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది.  రోబో సినిమా విషయంలో గౌరవ హైకోర్టులో నాకు అనకూలంగా తీర్పు వచ్చింది. కేసు వివరాలతో సహా ప్రజలకు తెలుపుతున్నాను.  సివిల్ సూట్ నం. 914/2010లో పూర్తి వివరాలు ఉన్నాయి. న్యాయస్థానం ఇరుపక్షాల సాక్ష్యాలను, వాదనలను జాగ్రత్తగా పరిశీలించింది. ఆపై 'ఎంథిరన్‌' (రోబో) చిత్రానికి సంబంధించిన  హక్కులు తనకే ఉన్నాయంటూ అరూర్‌ తమిళనాథన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

దీంతో తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. కానీ, సరైన ఆధారం లేకుండా ఆరోపణలు చూపుతూ నాకు సంబంధించిన స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. ఈ చర్య న్యాయస్థానం నిర్ణయాన్ని తప్పుగా చూపినట్లు అవుతుంది. అధికార దుర్వినియోగం కింద​ కూడా వస్తుంది.  కేవలం ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదికను బేస్‌ చేసుకొని నా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.  ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈడీ  పక్కనపెట్టింది.' అని ఆయన తెలిపారు.

 ఏం జరిగిందంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్‌ పేరుతో ఈ మూవీని శంకర్  తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్‌ తమిళనాథన్‌ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాపీరైట్‌ చట్టాన్ని ఆయన  ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక  శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు  మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్‌ కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement