ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ, ఈ మూవీ కంటే ముందే విడుదల కావాల్సిన 'విశ్వంభర' గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. టీజర్ విడుదల సమయంలో వీఎఫ్ఎక్స్ వర్క్పై ట్రోల్స్ రావడంతో దర్శకుడు వశిష్ట సరిచేసే పనిలో ఉన్నారు. అయితే, ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారు. తాజాగా నిర్మాత, పంపిణీదారు ధీరజ్ మొగిలినేని ఒక వేడుకలో మాట్లాడుతూ విశ్వంభర గురించి పలు విషయాలు పంచుకున్నారు.
వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మెప్పిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ ట్రైలర్పై ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలు మరింత బజ్ని క్రియేట్ చేశాయి. కపుల్ ఫ్రెండ్లీ సినిమా సక్సెస్ మీట్లో ధీరజ్ ఇలా మాట్లాడారు. 'కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ విశ్వంభర ట్రైలర్ చూశాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది. యూట్యూబ్లో విడుదలైన తర్వాత ట్రైలర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తాయి. సినిమాకు సంబంధించి అసలు కథను చాలా దాచి ఉంచారు. ట్రైలర్ చూడగానే నాకు హై ఓల్టేజ్ ఫీల్ కలిగింది.
ఈ ఏడాదిలో విశ్వంభరతో పాటు శర్వానంద్ బైకర్ చిత్రాలు రెండూ యువి క్రియేషన్స్ను ఉన్నత స్థానానికి చేరుస్తాయి.' అని ఆయన అన్నారు. అయితే, విశ్వంభర సినిమాను తాను డిస్ట్రిబ్యూట్ చేయలేదని ఆయన అన్నారు. ఆ సినిమాను పంపిణీ చేయాలంటే తనలాంటి వారు మరో పదిమంది కావాలని ఆయన చెప్పుకొచ్చారు. తన స్థాయికి మించి విశ్వంభర మార్కెట్ ఉందని ఆయన అన్నారు. అయితే, ఈ మూవీ ట్రైలర్ మార్చిలో విడుదల కావచ్చని తెలుస్తోంది.


