టైటిల్:ధర్మస్థ నియోజకవర్గం
నటీనటులు:సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ కుమార్, తదితరులు
నిర్మాత: మేరుం భాస్కర్
దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట
సంగీతం: మహావీర్ ఏలేందర్
ఎడిటింగ్ : సాయిబాబు తలారి
విడుదల తేది: సెప్టెంబర్ 4, 2026
కథేంటంటే..
ధర్మస్థల నియోజకవర్గం ఎమ్మెల్యే బైర్రాజు(సాయి కుమార్) ఓ సీనియర్ రాజకీయ నాయకుడు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు. అదే నియోజకవర్గంలో వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి కాలేజీని నడుపుతూ అందులోనే డ్రగ్స్ దంగా చేస్తుంటారు. అక్కడ స్టూడెంట్స్కి విశ్వ(శివ కుమార్) ద్వారా డ్రగ్స్ అందించి.. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేస్తుంటారు. ఇలా విద్యార్థులను చెడగొడుతున్న కాలేజీ యాజమాన్యం, విశ్వపై పోరాటం చేస్తుంది అదే కాలేజీ లెక్చరర్ అరుంధతి(వితిక షేరు). ఆమెకు అదే కాలేజీ స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా(రాయంచ కొక్కురు)తోడుగా ఉంటారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. తన కొడుకు హత్య వెనుక ఎమ్మెల్యే బైర్రాజు ఉన్నాడని తెలిసి టీ కొట్టు అమ్ముకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయాల్లోకి వస్తాడు. విద్యార్థుల సపోర్ట్తో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైర్రాజుపై పోటీకి దిగుతాడు. ధనబలం ఉన్న బైర్రాజుపై ఛాయ్వాలా ఈశ్వరయ్య గెలిచాడా లేదా? ఎన్నికల్లో గెలిచేందుకు బైర్రాజు వేసిన ఎత్తులను విద్యార్థులతో కలిసి ఈశ్వరయ్య ఎలా చిత్తు చేశాడు? బద్రి చావుకు కారణమైన వారిని ఎలా శిక్షించారు? ఈశ్వరయ్య గెలిచాక ధర్మస్థల నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటి? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
పొలిటికల్ యాక్షన్ డ్రామాకి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. సరైన పాయింట్ ఎంచుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చ. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ని పాయింట్గా తీసుకొని దానికి పొలిటికల్ టచ్ ఇచ్చి ఓ మంచి కథను రాసుకున్నాడు. అయితే దాన్ని స్క్రీన్పై అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యాడు. క్రైమ్ డ్రామాకి పొలిటికల్ టచ్ ఇచ్చి గ్రిప్పింగ్గా కథను చెప్పిన విధానం బాగుంది. కానీ చాలావరకు కథనం ఊహకు అందేలా సాగుతుంది.
ఫస్టాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం తిరుగుతుంది. డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడంతో... ఇంటర్వెల్ ట్విస్ట్... సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజు... ఈశ్వరయ్య చేసే పొలిటికల్ కాంపెయిన్... తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు... ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. అలాగే దుస్టుల సహవాసం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం.
ఎవరెలా చేశారంటే..
టీ అమ్ముకునే ఓ సామాన్య ఈశ్వరయ్య పాత్రలో సుమన్ చక్కగా నటించాడు.సెకండాఫ్లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఏడు సార్లు గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకుంటాడు. అయితే ఇలాంటి పాత్రలు ఆయన ఇప్పటికే చాలా పోషించడంతో కొత్తగా అనిపించదు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు.. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో చక్కగా నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, చివర్లో వరుణ్ సందేశ్, కాలకేయ ప్రభాకర్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
సాంకేతిక విషయాలకొస్తే.. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.సందర్భానుసారంగా రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆలోచింప జేస్తాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ఫస్టాప్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


