
అల్లూరి సీతారామరాజు: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెరసి ఓ పల్లెటూరి చిన్నోడు... ‘కోర్ట్’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ‘కోర్ట్’ సినిమా ద్వారా హీరోగా మారి బంపర్ హిట్ కొట్టాడు. ఆయన ఇటీవల తన స్వగ్రామమైన కూనవరం వచ్చారు. ఆయనకు స్థానికులు అపూర్వ స్వాగతం తెలిపి ఘనంగా సన్మానించారు. చింతూరు ఏజెన్సీ డివిజన్ కూనవరం గ్రామానికి చెందిన రోషన్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును తెలుసుకుందాం...
ఇటీవల విడుదలైన కోర్ట్ సినిమా హిట్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. హీరో నాని నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ బంపర్ హిట్ సాధించింది. ఇందులో యువ హీరోగా రోషన్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషన్ తాత మస్తాన్ కూనవరం ఎంపీడీవో కార్యాలయంలో డ్రైవర్గా పనిచేశారు. తండ్రి రషీద్ వైద్యశాలలో పనిచేసేవారు. రోషన్ చదువు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు భద్రాచలంలో..అనంతరం ఖమ్మంలో పదో తరగతి వరకు సాగింది. రోషన్కు చిన్నతనం నుంచే డ్యాన్స్పై మక్కువ ఉండేది.
తన సోదరుడు తౌఫిక్ ప్రోత్సాహంతో పాల్వంచలోని అరవింద్ మాస్టర్, భద్రాచలంలోని పవన్, నాగురాజు మాస్టార్ల వద్ద డ్యాన్స్లో మెలకువలు నేర్చుకున్నారు. సినిమారంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్కు కుటుంబసమేతంగా తరలివెళ్లారు. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శనతో రోషన్కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్భాస్కర్ అతడిలోని ప్రతిభను గుర్తించి, ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ తరువాత అరవింద సమేత, గద్దలకొండ గణేష్, వెంకీ మామ చిత్రాల్లో బాలనటుడిగా.. సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, మిషన్ ఇంపాజిబుల్, స్వాగ్ వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది.
‘సరిపోదా శనివారం’తో ప్రత్యేక గుర్తింపు
సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో రోషన్కు ప్రత్యేక అవకాశం లభించింది. అతనిలో నటనను హీరో నాని గుర్తించారు.. ఈ నేపథ్యంలో నాని నిర్మాతగా, రామ్ జగదీష్ దర్శకత్వంలో తీసిన ‘కోర్ట్’ సినిమాలో యువ కథనాయుకుడిగా రోషన్కు అవకాశం దొరికింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించింది. రోషన్ నటనకు పెద్ద పెద్ద కథనాయకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
స్వగ్రామస్తుల ఆదరణ మరువలేను
ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ తాను నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవిని కలిశానని, చిత్రంలో తాను చేసిన డ్యాన్స్ను ఆయన మెచ్చుకొని ప్రశంసించారని గుర్తు చేశారు. కోర్ట్ చిత్రం చూసిన తరువాత కథనాయకుడు చిరంజీవి స్వయంగా ఆహ్వానించి జ్ఞాపికను బహుకరించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.ఇటీవల తన స్వగ్రామం కూనవరం వచ్చానని, స్థానికులు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. ప్రస్తుతం కొందరు దర్శకులు కథలు వినిపించారు. వాటిలో కొన్నింటికి అంగీకారం తెలిపే అవకాశముందని చెప్పారు.