
తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్లో భాగంగా ఆయన కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్కు వెళ్లారు. అక్కడ పరిస్థితిలు ఎలా ఉంటాయో తన యూట్యూబ్లో చెప్పుకొచ్చాడు. పాక్లో మొదటిరోజు అంటూ ఒక వీడియోను ఆయన రీసెంట్గా షేర్ చేశారు. దానిని చూసిన ఎన్ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేశారు.
పహల్గాం (Pahalgam Terror Attack)లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై భారత్ దాడికి దిగింది. ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాక్ వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు. వాటిపై ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్థాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీసింది. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని వాటితో డబ్చు చేసుకోవచ్చనే ఉద్దేశంతో తన యూట్యూబ్లో పోస్ట్ చేశారని తెలుస్తోంది.

పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందని హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను (Jyoti Malhotra) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు (ISI) మలచుకున్నట్లు హరియాణా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించారు. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్లో పలుమార్లు పర్యటించిందని పోలీసులు గుర్తించారు. ఓసారి చైనాకూ కూడా ఆమె వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఆమె తరహాలోనే బయ్యా సన్నీ యాదవ్కు కూడా ఏమైనా పాక్ అధికారులతో పరిచయాలు ఉన్నాయా..? అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు.