Jawan: క్రికెట్‌ మ్యాచ్‌లో 'జవాన్‌' ప్లాన్‌: అట్లీ

Atlee Kumar React On Shah Rukh Khan - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్‌. దీనికి కారణాలెన్నో. ముఖ్యంగా పఠాన్‌ వంటి సంచలన విజయం సాథించిన చిత్రం తరువాత తెరపైకి వస్తున్న చిత్రం ఇది కావడం. అదేవిధంగా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ దీనికి దర్శకుడు కావడం. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార జవాన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం. క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతం, తమిళ నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే గెస్ట్‌ అపీరియన్స్‌ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు)

ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు (సెప్టెంబర్‌ 7) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మీడియాతో ముచ్చటిస్తూ తాను బాలీవుడ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఊహించలేదన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌నేనని పేర్కొన్నారు. ఆయన నమ్మకమే జవాన్‌ చిత్రం అని పేర్కొన్నారు. ఒకసారి క్రికెట్‌ మ్యాచ్‌ చూడడానికి చైన్నె వచ్చినప్పుడు షారూఖ్‌ఖాన్‌ తన కార్యాలయాలనికి వచ్చారన్నారు. తామిద్దరం సుమారు మూడున్నర గంటలు మాట్లాడుకున్నామని చెప్పారు. అప్పుడే జవాన్‌ చిత్రానికి బీజం పడిందని చెప్పారు. రూ.350 కోట్లు బడ్జెట్‌లో చిత్రం చేయడానికి సిద్ధమయ్యామన్నారు.

కరోనా కాలంలో షారూఖ్‌ఖాన్‌ ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అయితే తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అలా నటి నయనతార, విజయ్‌సేతుపతి, యోగిబాబు, సంగీత దర్శకుడు అనిరుధ్‌, ఎడిటర్‌ రూపన్‌ ఇలా అందరినీ తానే ఈ చిత్రంలోని తీసుకున్నానని చెప్పారు. అయితే చిత్రం అన్ని వర్గాలను అలరించే విధంగా రూపొందించాలన్నదే లక్ష్యంగా భావించామన్నారు. జవాన్‌ చిత్రం అందరికీ సంతృప్తికరంగా వచ్చిందన్నారు. పఠాన్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ చిత్రాన్ని రీచ్‌ అవుతుందా? అన్న విషయం గురించి ఆలోచించలేదన్నారు. ఒక మంచి చిత్రం చేయాలన్న ధ్యేయంతోనే జవాన్‌ చిత్రం చేశామని అట్లీ చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top