
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh).. అచ్చ తెలుగమ్మాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి మూడు దశాబ్దాలవుతోంది. రామబంటు చిత్రంతో బాలనటిగా కెరీర్ ఆరంభించింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం తమిళ మూవీతోనే! తను ఫస్ట్ హిట్ అందుకున్న మూవీ అట్టకత్తి (2012). తొమ్మిదేళ్లు తమిళంలో హీరోయిన్గా రాణించిన తర్వాత కౌసల్యా కృష్ణమూర్తితో తెలుగువారికి కథానాయికగా పరిచయమైంది.
ఎన్నో సినిమాలు..
మిస్మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్, డియర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ అందుకోలేకపోయింది. తెలుగు ప్రేక్షకులు ఎల్లకాలం గుర్తుంచుకునే పాత్ర చేయాలని తహతహలాడింది. ఆ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ (Sankranthiki Vasthunam Movie) ఆమె ఇంటి తలుపు తట్టింది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ భార్యగా, నలుగురు పిల్లల తల్లిగా నటించేందుకు సంతోషంగా అంగీకరించింది. తన కష్టం, ప్రయత్నం వృథా పోలేదు.
మేనకోడలి సినిమా..
సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఐశ్వర్య రాజేశ్ పోషించిన అమాయకపు భాగ్యమ్మ పాత్ర జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఐశ్వర్య సినిమాలో అమాయకురాలైనా ఇంట్లో మాత్రం రౌడీ అంటోంది ఆమె మేనత్త, నటి శ్రీలక్ష్మి (Srilakshmi). సోమవారం నాడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ విక్టరీ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. నా మేనకోడలి సినిమా కదా.. తప్పకుండా సినిమా చూసి తీరాలి. లేదంటే నాకు తన్నులు పడతాయి.
పైగా బ్లాక్బస్టర్ మూవీ.. చూడకుండా ఎలా వదిలేస్తాను. ఐశ్వర్య.. ఇంట్లో, బయటా రౌడీయే అని శ్రీలక్ష్మి సరదాగా చెప్పుకొచ్చింది. కాగా ఐశ్వర్య తండ్రి రాజేశ్ తెలుగులో హీరోగా నటించాడు. 38 ఏళ్ల వయసులోనే ఈయన అనారోగ్యంతో మరణించాడు. నటి శ్రీలక్ష్మి తమ్ముడే రాజేశ్.
చదవండి: హీరోయిన్లను ఏడిపించా.. ఓసారి భాగ్యశ్రీని అడగండి: డైరెక్టర్