సంక్షేమానికే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
● సంగారెడ్డి వేదికగా స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ఊసే ఎత్తని సీఎం
టూరిజం ప్రాజెక్టుగా సింగూరు: మంత్రి దామోదర
సింగూరు ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా మార్చాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యా, వైద్య, ఆరోగ్య పరంగా దేశంలోనే అత్యున్నతస్థాయిలో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2005 అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సింగూరు కాలువ పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. ఆ కాల్వ ద్వారా పంటలకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1.68కోట్లతో సీసీ లైనింగ్, సింగూరు మరమ్మతులకు రూ.17 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 వేల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు: మంత్రి వివేక్
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని త్వరలో మరో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యో గాలు కల్పించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు.
విప్లవాత్మకమైన మార్పులతో స్మార్ట్ కార్డులు: మంత్రి ఉత్తమ్
నిరుపేదలకు అవసరమయ్యే ఆహార భద్రత కార్డు 10 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి 85% జనాభాకు 3.42కోట్ల మందికి ఒక కోటి ఆరు లక్షల కార్డులు ఇవ్వనున్నామని చెప్పారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ... ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీరుపై ఘాటైన విమర్శలు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం సాగింది. రాష్ట్రంలో 1.06 లక్షల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యాక్రమాన్ని సంగారెడ్డి వేదికగా సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో పలువురు లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి సుమారు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీని జిల్లా వాసులు గెలిపిస్తే..దేశానికి ప్రధానమంత్రి అయి.. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పొందుతున్న లబ్ధిని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హాయాంలో అమలైన డబుల్బెడ్రూం ఇళ్ల పథకం వైఫల్యాలను రేవంత్రెడ్డి ఎత్తి చూపారు. మాజీ సీఎం కేసీఆర్పై, మాజీ మంత్రి హరీశ్రావుపై ఘాటైన విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీపై హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులు ప్రతిపక్ష పార్టీల ట్రాప్లో పడొద్దని హితువు పలికారు.
ఊసేలేని జిల్లా అంశాలు..
సీఎం పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తారని అందరూ భావించారు. అయితే ఈసారి సీఎం జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక్క హామీని కూడా ఇవ్వకపోవడం జిల్లా వాసులను ఒకింత నిరాశకు గురి చేసింది. సింగూరు జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ బహిరంగసభ వేదికగా సీఎం దృష్టికి తెచ్చినా కూడా..ఈ అంశంపై సీఎం ఎలాంటి హామీ గానీ, ప్రకటన కానీ చేయలేదు.
జగ్గారెడ్డి పోటీపై..
నిర్మల పదవిపై సీఎం స్పష్టత
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల పదవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఒకింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. రూ.వెయ్యి కోట్లు పెట్టినా ఇలాంటి సేవ చేసే నాయకుడు సంగారెడ్డికి లభించరని కితాబిచ్చిన సీఎం..జగ్గారెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టతనిచ్చారు. మరోవైపు నిర్మలరెడ్డి టీజీఐఐసీ పదవి అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. వీరిద్దరికి ఇచ్చే పదవులేవో ఇస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఐఐటీహెచ్లో హెలీప్యాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో ఐబీ చౌరస్తాకు చేరుకుని అక్కడ దివంగత ప్రధానులు నెహ్రు, రాజీవ్గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఓపెన్టాప్ వాహనంలో సభా వేదిక వద్దకు ర్యాలీగా వచ్చారు.
మాట్లాడుతున్న సీఎం
యువతకు ఉద్యోగాలు: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
విదేశీ పెట్టుబడులు రాక, యువతకు 80 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం కల్పించనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. స్మార్ట్ రేషన్ కార్డు అంటే కార్డు మాత్రమే కాదు కుటుంబానికి గౌరవంతో పాటు ఆహార భద్రత, గ్రామానికి గుర్తింపు కార్డు అన్నారు.


