పాపన్నపేట(మెదక్): చినుకు పడితే చాలు మెదక్– బొడ్మట్పల్లి రోడ్డు చెరువును తలపిస్తోంది. పాపన్నపేట మండల ముఖద్వారం ఎల్లాపూర్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల కమాన్ వద్ద నీరు చేరడంతో ప్రయాణికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తపల్లి అనంతుని వాగు బ్రిడ్జికి ఇరుప్రక్కల ఉన్న మట్టి రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ రోడ్డుపై పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు లేక రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డు శిథిల మవుతోంది. మెదక్ –బొడ్మట్పల్లి రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఎల్లాపూర్ వద్ద ఫతేనహర్ నుంచి వచ్చే నీటికి, వాన నీరు తోడైతే ఎల్లమ్మ గుడి సమీపంలో గల గుండు మోరి, పొర్లి రోడ్డుపై నీరు చేరుతోంది. ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ద్వారంలో నీరు చేరడంతో చిన్నారులు,రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. శానాయపల్లి వద్ద ఉన్న రైస్ మిల్లు నుంచి, ఎల్లాపూర్ గ్రామం వరకు డ్రెయిన్ నిర్మిస్తే, వృథా నీరు మంజీర నదిలో కలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఏడుపాయల కమాన్ ముందు ఉన్న చిన్నపాటి బ్రిడ్జి మూసుకుపోవడంతో, ఆర్చ్గేట్ ముఖద్వారం జలమయమై రోడ్డు కనిపించని దుస్థితి నెలకొంది. వర్షం పడితే, గుట్టపై నుంచి వచ్చే నీరు ఇక్కడ చేరుతుంది. బ్రిడ్జి ఎత్తు పెంచి, కాలువ నిర్మిస్తే, ఫతేనహర్ కెనాల్లోకి నీరు వెళ్తుంది. ఇక కొత్తపల్లి అనంతుని వాగుపై బ్రిడ్జి నిర్మించినప్పటికీ, ఇరుప్రక్కల రోడ్డు వేయలేదు. దీంతో మట్టి రోడ్డు గుంతల మయంగా మారి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.
మెదక్–బొడ్మట్పల్లి రోడ్డు దుస్థితి
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు


