#Dhoni: బ్యాడ్‌న్యూస్‌.. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత ఇక అంతే! | He Will Definitely Not Come: Rayudu On Dhoni Batting Up Order | Sakshi
Sakshi News home page

#Dhoni: బ్యాడ్‌న్యూస్‌.. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత ఇక అంతే!

Apr 1 2024 3:24 PM | Updated on Apr 1 2024 3:25 PM

IPL 2024 CSK vs DC: విశాఖపట్నంలో అద్భుత బ్యాటింగ్‌తో అసలైన టీ20 మజాను అందించాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో తనదైన శైలిలో షాట్లు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. 

నలభై రెండేళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ఐపీఎల్‌-2024లో బ్యాటింగ్‌ వచ్చిన తొలిసారే తన పవరేంటో చూపించాడు. ముఖ్యంగా ఒంటిచేత్తో ధోని బాదిన షాట్‌ అతడి ఇన్నింగ్స్‌కే కాదు మ్యాచ్‌లోనూ హైలెట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు.

అయితే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇంత చేసినా ధోని సీఎస్‌కేను గెలిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచింది. కానీ.. తదుపరి మ్యాచ్‌ నుంచి ధోని బ్యాటింగ్‌ మెరుపులు చూసే అవకాశం తప్పక వస్తుందనే నమ్మకం కుదిరిందని సంతోషిస్తున్నారు. 

అయితే, మాజీ క్రికెటర్‌, సీఎస్‌కు ఆడిన అంబటి రాయుడు మాత్రం ఇప్పుడే అంతగా సంబరపడిపోవద్దని అంటున్నారు. ఇకపై బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ధోని ముందు వచ్చే ఛాన్స్‌ ఉందా ప్రశ్నకు బదులిస్తూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ తర్వాత అతడు కచ్చితంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రాడు.

ఎందుకంటే.. లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి సీఎస్‌కేను గెలిపించగల సత్తా ఉన్న ధోని ఆత్మవిశ్వాసం ఈ ఇన్నింగ్స్‌తో మరింత పెరిగిందని చెప్పవచ్చు. 

నిజానికి.. ధోని ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వస్తే చూడాలనుకునే మనలాంటి వాళ్ల ఆశలకు ఇక గండిపడినట్లే’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2024లో కామెంటేటర్‌గా ఉన్న రాయుడు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో.. ఇలా తన అభిప్రాయం పంచుకున్నాడు.

కాగా ఐపీఎల్‌-2024 సందర్భంగా కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ధోని .. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement