చెన్నూర్: చెన్నూర్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు గత 62ఏళ్లుగా మట్టి గణపతిని స్వయంగా తయారు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1958లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అకినపల్లి నానయ్య తన మిత్రబృందం లక్ష్మయ్య, మల్లయ్యతో కలిసి మట్టి గణపతిని తయారు చేశారు. విశ్వకర్మ కాలనీలోనే విశ్వకర్మ గణేశ్ మండలి పేరుతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ప్రతీ రోజు భజన చేసేవారు. నలుగురు వ్యక్తులు విగ్రహాన్ని మోసుకెళ్లి పెద్ద చెరువులో నిమజ్జనం చేసేవారు. ఆనాడు దూరదృష్టితో దివంగత నానయ్య పంతులు ప్రారంభించిన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. నవర్రాతి ఉత్సవాలు ముగిసే వరకు మండలి వద్ద భజన మండలి ఆధ్వర్యంలో ప్రతీ రోజు భజన చేస్తారు. భజన చేసుకుంటూ వెళ్లి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
రెండ్రోజుల్లోనే తయారీ..
నాడు విగ్రహం తయారీకి పక్షం రోజలు కష్టపడేవారు. పొలాల మట్టిని తీసుకొచ్చి నియమనిష్టలతో పక్షం రోజులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండి తయారు చేసేవాళ్లమని విశ్వబ్రాహ్మణులు తెలిపారు. ప్రస్తుతం విశ్వబ్రాహ్మణ యువకులు బెజ్జంకి వినయ్చారి, అకినపల్లి వినోద్, మణికంఠ, అభిరామ్తోపాటు మరికొందరు కలిసి రెండ్రోజుల్లో మట్టి వినాయక ప్రతిమను తయారు చేస్తున్నారు.
అందరిలో మార్పు రావాలి..
రోజు రోజుకు పర్యావరణం దెబ్బతింటోంది. రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాలు చెరువులు, కుంటల్లో కరిగిపోకుండా అందులో జీవించే జలజీవరాసులు మృత్యువాత పడుతున్నాయి. నీరు, వాతావరణం కలుషితం అవుతున్నాయి. మట్టి విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహించాలన్నది ఒకరితో సరిపోదు.. అందరిలో మార్పు రావాలి.
– అకినపల్లి సత్యనారాయణ, చెన్నూర్


