ప్రజావసరాల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయొద్దు
మంచిర్యాలటౌన్: ‘ప్రజావసర స్థలాలు లే..ఔట్’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంచిర్యాల నగర పాలకసంస్థ కమిషనర్ అన్వేష్ స్పందించారు. నగరంలోని హైటెక్సిటీ కాలనీలో ఎకరం స్థలాన్ని ప్రాథమిక పాఠశాల కోసం కేటాయించగా, ప్లాట్లు చేసి అమ్మాలని చూస్తున్న విషయం వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. హైటెక్సిటీలోని సర్వే నంబర్లు 366, 367, 368, 371 నుంచి 375 వరకు, 392, 396, 397, 399 నుంచి 405 వరకు గల 68.95 ఎకరాల భూ మిని లేఔట్ చేసి, ప్రజావసరాల కోసం వది లేసిన స్థలాలను ప్లాట్లుగా విభజిస్తే, రిజిస్ట్రేషన్ చేయవద్దని మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కమిషనర్ లేఖ రాశారు. పాఠశాల కోసం ఎకరం స్థలాన్ని వదిలేయగా, అందులో ప్లాట్లు చేసి అమ్ముతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల మేరకు, ఆయా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని సూచించారు.


