మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని దొరలబంగ్లాస్ ఏరియా సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు మంగళవారం మండలంలోని సండ్రోనిపల్లి కేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. తహసీల్దార్ సతీష్కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ లక్కీడ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 560 డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. గతంలో 253 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన 307 ఇళ్ల కేటాయింపు కోసం 3,886 మంది దరఖాస్తు చేసుకోగా 491మందిని గుర్తించారు. ఎస్టీలకు 12, ఎస్సీలకు 12, మైనార్టీలకు 33, వికలాంగులకు 19 కేటాయించగా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిన 220 ఇళ్లను ఓపెన్ కేటగిరిలో పంపిణీ చేశారు. మిగిలిన 11 ఇళ్లను ప్రభుత్వ జీవో ప్రకారం ఎక్స్ సర్వీస్మెన్లకు పంపిణీ చేస్తామని తెలిపారు. పీడీ బన్సీలాల్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డీటీ సంతోష్కుమార్, ఆర్ఐ అంజన్కుమార్ పాల్గొన్నారు. కాగా, లబ్ధిదారుల ఎంపికపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం వద్ద అతికించిన జాబితాలో 447 ఉండగా.. లక్కీ డ్రా సమయంలో 491కి చేరింది. పెళ్లి కాని వారికి, రిటైర్డు సింగరేణి ఉద్యోగులకు, రేషన్ కార్డు లేని వారికి కేటాయింపులు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.


